జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపించలేక పోతున్నారు. ఏ అంశం పట్ల నైనా దూకుడుగా ఉండే జగ్గారెడ్డి కాస్త సంయమనం పాటిస్తున్నారు. ముఖ్యంగా అదికారవ పార్టీ విధానాల పట్ల ఆచి తూచి వ్యవహరించడమే కాకుండా ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడితే ముఖ్యమంత్రిని దగ్గరుండి స్వాగతం పలుకుతానని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా తన బార్యకు, తనకు పార్టీలో కీలక బాద్యతలు కట్టబెట్టాల్సిందిగా జగ్గారెడ్డి అదిష్టానం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి డిమాండ్ల పట్ల అదాష్టానం ఎలా స్పందిస్తుంది అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.
విపత్కర పరిస్థితుల మద్య గెలుపొందిన జగ్గారెడ్డి..! అదిష్టానానికి అనేక ప్రతిపాదనలు..!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసినా ఎన్నికల హడావిడి మాత్రం తగ్గడంలేదు. ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో పాటు, కొద్దిరోజుల్లో లోక్సభ సమరం కూడా ఉండడంతో అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార గులాబీ మాత్రం 16 ఎంపీ స్థానాలను గెలవాలనే టార్గెట్ తో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసేసింది. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది.
అదికార పార్టీ విధానాలపై సంయమనం..! తొందరపడేది లేదంటున్న జగ్గారెడ్డి..!!
మరోవైపు, ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం, గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావ్రుత్తం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండాలా..? వద్దా..? అనే విషయంపై టీ కాంగ్రెస్ నేతలు స్థానిక నాయకల అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారే ప్రసక్తి లేదు..! అదిష్టానం కనికరించాలంటున్న జయప్రకాశ్ రెడ్డి..!!
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని ఎంతో మంది సీనియర్లు ఓడిపోయారు. ఆ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకున్న జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖ, సర్వే సత్యనారాయణ సహా పలువురు ఓటమి పాలయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గెలిచి తన సత్తాను నిరూపించుకున్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఈ మధ్య తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కేసీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మీదట ముఖ్యమంత్రిని విమర్శించనని బహాటంగా చెప్పారు. నియోజక వర్గంలో మంచి పనులు చేస్తే ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతానని చెప్పుకొచ్చారు.
తనకు పార్టీలో కీలక బాద్యతలు కావాలి..! అదిష్టానం ముందు జగ్గారెడ్డి ప్రతిపాదనలు..!!
ఇక, తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ పొత్తు ఉండాల్సిందేనని అధిష్ఠానం దగ్గర పట్టుబట్టారు. అలాగే తన భార్య నిర్మలకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ను కోరినట్లు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో గెలిచినందుకు జగ్గారెడ్డి అధిష్ఠానం దగ్గర తన డిమాండ్లను వినిపిస్తుండడం చూసి పార్టీలోని పలువురు నేతలు అవాక్కవుతున్నట్టు సమాచారం. జగ్గారెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..!!