జగ్గారెడ్డి సంచలనం..! వరుసగా రెండు, మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వొద్దని రాహుల్ కి లేఖ..!!
హైదరాబాద్ : ఎప్పుడు ఏ సంచలన వార్త బహిర్గతం చేస్తాడో తెలియని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరో సంచలన వార్త చెప్పారు. ఆ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడని అంశంగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓటమి-గెలుపు, పెద్ద-చిన్నా, ముసలి-ముతక, అవ్వ-అక్క అన్న చందంగా కలగూర గంపలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీనుండి సీటు తెచ్చుకుని ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పనిచేసే వాళ్లు చాలా మంది ఉంటారు. చాలా ఏళ్లుగా ఓడిపోతూ మళ్లీ మళ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. అలాంటి వారికి మింగుడు పడని ఓ వార్తని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రస్తావించి ఆవాక్కయ్యేలా చేసారు. అంతే కాదు అదే అంశం పట్ల ఎఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ కి లేఖ కూడా రాయడం కొసమెరుపు..!
రానున్న లోక్సభ ఎన్నికల్లో యువతకు టికెట్లు కేటాయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వరుసగా రెండు, మూడుసార్లు ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి టికెట్టు ఇవ్వొద్దని రాహుల్కు ఆయన సూచించారు. పార్టీకి ముఖ్యమైన వారికి నామినెటేడ్ పదవులు ఇవ్వాలి గానీ, గెలిచే సత్తాలేని నాయకులకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని అదిష్టానానికి విజ్ఞప్తి చేసారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న యువకులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించాలని జగ్గారెడ్డి లేఖలో అభిప్రాయపడ్డారు. యూత్ కాంగ్రెస్, ఓయూ జాక్ నుంచి టికెట్లు అడుగుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్కు విజ్ఞప్తి చేశారు. కాగా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం కసరస్తు చేస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ లేఖను సంధించడం సంచలనంగా మారింది.