సీఎం కుర్చీ కాదని.. రాజకీయాల్లో అజాత శత్రువు.. జైపాల్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం
హైదరాబాద్ : జైపాల్ రెడ్డి రాజకీయాల్లో అజాత శత్రువు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా కూడా ఏమాత్రం భేషజాలు చూపని నిగర్వి. ఎలాంటి బిరుదులు లేకున్నా.. నీతి, నిజాయితీ తన మార్గాలుగా ముందుకు సాగిన డైనమిక్ లీడర్. అవినీతి మరక లేని ది పర్ఫెక్ట్ లీడర్. అంతేకాదు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగిన అలుపెరగని యోధుడు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డి ప్రస్థానంపై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.
ముక్కుసూటి తత్వం.. జైపాల్ రెడ్డి సొంతం
సూదిని జైపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న డైనమిక్ లీడర్. ఇంటి పేరుకు తగ్గట్టే.. ఆయన తీరు కూడా సూదిలానే ఉండేది. అందుకే ఆయనది ముక్కుసూటి తత్వం. రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్రంలోనూ విలక్షణ నేతగా పేరు గడించారు. అందుకేనేమో పదవులు తన దగ్గరకే వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాదు ప్రజాదరణతో అపూర్వ విజయాలు సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఐదుసార్లు ఎంపీగా గెలిచారంటే మామూలు విషయం కాదు. ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారో, ఆయన వ్యక్తిత్వమేంటో ఈ విజయాలను అవలోకిస్తే తెలుస్తుంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగుల గ్రామంలో సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు 1942, జనవరి 16న జన్మించారు. మాడుగులతో పాటు నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించారు. ఓయూ నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు.. పార్టీలకు అతీతంగా నేతల సంతాపం
అవినీతి మరక లేదు.. సీఎం కుర్చీ ఆఫర్ వచ్చినా..!
నీతి, నిజాయితీ ఆయన సొంతం. అవినీతి మరక అంటని గొప్ప నాయకుడు. అందుకే రాజకీయాల్లో అలుపెరగని యోధుడిగా ఆయన ప్రస్థానం సాగింది. పార్టీలకు అతీతంగా నేతలతో చనువు పెంచుకున్న, ప్రేమను పంచుకున్న మహా గొప్ప లీడర్ జైపాల్ రెడ్డి అంటే అతిశయోక్తి కాదేమో. కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన జైపాల్ రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో చేరారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ హస్తం గూటికి చేరారు జైపాల్ రెడ్డి. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పనిచేయడమే తప్ప ప్రతిఫలం ఆశించని నేతగా ముద్రపడ్డ జైపాల్ రెడ్డికి పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీ రోల్ పోషించారు. అప్పుడు సీఎం కుర్చీ ఎక్కాలని హైకమాండ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించారనే పేరుంది.
ఎన్నో పదవులు.. ప్రజాప్రతినిధిగా సేవలు
1977లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఆ తర్వాత 1980లో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1969లో తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా నాలుగు పర్యాయాలు అదే సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 1984లో మహబూబ్నగర్ ఎంపీగా మొదటిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1998, 1999, 2004 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా విజయం సాధించారు. 1990, 96లలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్గా.. ఐకే గుజ్రాల్ మంత్రివర్గంలో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా.. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు.
నలుగురి భార్యల ముద్దుల మొగుడు.. గంగాధర ఏందీ కథ..!
తెలంగాణ ఉద్యమంలో కీ రోల్.. ఢిల్లీ పెద్దలను ఒప్పించి
తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉద్యమం పీక్ స్టేజీకి చేరిన తరుణంలో ఆయన కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో క్రీయాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ హైకమాండును ఒప్పించి రాష్ట్ర సాధన సరళీకృతం చేశారు. అయితే ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగడంతో 2014లో ఓటమి చవిచూశారు. అవే ఆయనకు చివరి ఎన్నికలు. ఆ తర్వాత ఎప్పుడూ పోటీ చేయలేదు.
రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన జైపాల్ రెడ్డి ఆదివారం (28.07.2019) నాడు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని సంతాపం ప్రకటిస్తున్నారు.