జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు.. పార్టీలకు అతీతంగా నేతల సంతాపం
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం నాడు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేసేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ పక్కన జైపాల్ రెడ్డి అంత్యక్రియలు చేయాలని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. సోమవారం నాడు ఉదయం 9 గంటలకు జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్కు తీసుకురానున్నారు. ఉదయం 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అనంతరం అంతిమ యాత్ర మొదలు కానున్నట్లు సమాచారం.
జైపాల్రెడ్డి ఆకస్మిక మృతిపట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. జైపాల్ రెడ్డి లేకపోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కూడా జైపాల్రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
జైపాల్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి నాయకుడిని కోల్పోయామని.. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. తనకు ఆయన అత్యంత సన్నిహితుడైన జైపాల్ రెడ్డిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. రాజకీయాల్లో అలాంటి నీతి నిజాయితీపరుడైన నాయకుడు కనిపించడం అరుదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు.
జైపాల్ రెడ్డి మృతి పట్ల పార్టీలకతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ఆయన లేని లోటుతో తెలంగాణ రాజకీయాలను ఊహించుకోవడం కష్టమంటున్నారు కొందరు లీడర్లు. బీజేపీ నేతలు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నేతలు సంతాపం ప్రకటించారు. పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.