కాంగ్రెస్కు జానారెడ్డి షాక్: బీజేపీలో చేరికకు సన్నద్ధం, కేరళలో సంప్రదింపులు, అటునుంచే ఢిల్లీకి..?
కాంగ్రెస్ పార్టీ.. 130 ఏళ్ల సుదీర్ఘమైన నేపథ్య ఉంది. ఎందరో నేతలు ఎదిగారు, పదవులకే వన్నెతీసుకొచ్చారు. ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి.. ఎదిగారు. కాంగ్రెస్ నుంచి కూడా ఇతర పార్టీలకు వెళ్లి.. పార్టీలను నెలకొల్పారు. ప్రజలతో కొందరు ఉంటే.. కొందరు పత్తా లేకుండా పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో కూడా ఆశించిన స్థాయిలో లేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితిలో ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ పార్టీలో ఉన్న కొందరు బిగ్ షాట్స్ కూడా తట్ట బుట్టా సర్దుకుంటున్నారు. ఇందులో ప్రముఖంగా సీనియర్ నేత జానారెడ్డి పేరు వినిపిస్తోంది.
దూరం.. దూరంగా...
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. పార్టీతో కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో కూడా లేరు. కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వీరి మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని సమాచారం. అక్కడినుంచి ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నెల 7వ తేదీన హస్తిన వెళతారని.. అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని.. అందుకే పార్టీ మారాలని జానారెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని అనుచరులు అంటున్నారు.
నాగార్జున సాగర్ బై పోల్లో పోటీ..?
పార్టీలో చేరడమే కాదు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా జానారెడ్డి పోటీ చేస్తారని తెలిసింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. పోటీ చేయాలని బీజేపీ కోరగా, జానారెడ్డి కూడా అంగీకరించినట్టు సమాచారం. నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక నుంచి బీజేపీ సత్తా చాటుతోంది. కవితను అర్వింద్ ఓడించి.. క్రమంగా పునాదులను కదిపారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ విజయం సాధించింది. అదీ గ్రేటర్లో కూడా కంటిన్యూ అయ్యింది. 48 డివిజన్లు గెలిచి.. టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. దానిని అలాగే కంటిన్యూ చేయాలని బీజేపీ అనుకుంటోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని మూడుకు పెంచుకోవాలని భావిస్తోంది.
మిగతా నేతలు కూడా..?
ఇందుకోసం జానారెడ్డి అయితే బాగుంటుందని అనుకొన్నారు. ఆ వెంటనే సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా అంగీకరించడంతో ముహూర్తం ఫిక్స్ చేశారు. జానారెడ్డి సహా సీనియర్, ద్వితీయ శ్రేణి నేతలను బీజేపీ తమ వైపునకు తిప్పుకుంటోంది. జానారెడ్డి విషయానికి వస్తే నాగార్జునసాగర్పై రాజకీయంగా మంచి పట్టుంది. ఆయన చరిష్మాతో సీటు గెలవాలని భావిస్తోంది. ఇటీవల నోముల నర్సింహయ్య చనిపోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. వాస్తవానికి ఈసీ నోటీ ఫై చేసి.. ఎన్నిక గురించి తెలపాలి. ఇందుకు సమయం ఉన్నా.. బీజేపీ ముందుగానే పావులు కదుపుతోంది.
రఘువీర్ రెడ్డి వద్దు.. ఎందుకంటే..?
సాగర్లో కూడా విజయం సాధించాలని బండి సంజయ్ అనుకుంటున్నారు. అందుకు సంబంధించి ముందుగానే ప్రణాళిక రచించి ముందడుగు వేశారు. అయితే తొలుత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బీజేపీ బరిలోకి దింపుతుందనే వార్తలు వచ్చాయి. అందుకు జానారెడ్డి కూడా అంగీకరించారని తెలిసింది. కానీ ఇటీవల జరిపిన చర్చల తర్వాత సమీకరణాలు మారిపోయాయి. రఘువీర్ రెడ్డి పోటీపై బీజేపీ అయిష్టంగా ఉంది. జానారెడ్డిని బరిలోకి దిగాలని కోరింది. ఇందుకు ఆయన కూడా సమ్మతించడంతో గొడవ లేకుండా పోయింది. బీజేపీకి రూట్ క్లియర్ అయ్యింది. మిగతా సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది.