తెలంగాణ వైపు పవన్ కల్యాణ్ చూపు.. ఇదే సరైన సమయం అంటూ ఇండికేషన్స్
జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల వీర మహిళల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో పవన్కు ఫ్యాన్స్ ఎక్కువే.. వారిని కార్యకర్తలుగా మలచుకోవాలని అనుకుంటున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన క్రమంలో.. జనసేనాని కూడా ఇక్కడ ఫోకస్ చేశారు. ఇదివరకే నేతలు, అభిమానులు రావాలని కోరినా.. పెద్దగా పట్టించుకోలేదు.
కానీ చివరికీ దృష్టిసారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు పవన్ చాలా సందర్భాల్లో ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చిందని కామెంట్ చేశారు. దానిని రాజకీయం కూడా నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
తెలంగాణ గడ్డ మీదే ఆవిర్భావం
జనసేన ఆవిర్భవించింది హైదరాబాద్లోనే అని పవన్ స్పష్టంచేశారు. తెలంగాణ గడ్డపై తనకెంతో మమకారం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించానని.. అందుకే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని పవన్ సెలవిచ్చారు. తెలంగాణలో గల్లీ గల్లీ తిరిగానని.. ప్రతీ ప్రాంతంలో తనకు అనుబంధం పెనవేసుకుందని చెప్పారు.
త్వరలో తెలంగాణలో పార్టీ విస్తరణ ఉంటుందని స్పష్టంచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా చుట్టేశారు. తెలంగాణలో 2014లో పరిస్థితులకు అనుకులంగా వ్యవహరించానని పవన్ కల్యాణ్ చెప్పారు.
సంకల్పానికి అడ్డుపడిన రాజకీయం
నల్గొండ ప్లోరోసిస్ బాధితులకు సాయం చేయాలనే సంకల్పానికి రాజకీయం పడ్డుపడిందని జనసేన తెలిపింది. జనసేన తొలి ఎంపీటీసీ స్థానం గెలుచుకుంది తెలంగాణ గడ్డమీదనే అని చెప్పారు. ఇక్కడ దూకుడు ప్రదర్శిస్తోన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాని పవన్ తెలిపారు. సంకోచం లేకుండా మాట్లాడే మధ్యతరగి ప్రజలే తనకు అండా దండా అని క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో పోటీ చేయాలని అనుకున్నామని. కానీ బీజేపీ వినతి మేరకు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు.
ఇదే సరైన సమయం
రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు ఇదే సరైన సమయం అని పవన్ కల్యాణ్ అన్నట్టు సమాచారం. ఇక్కడ జనసేన కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాలో అడుగిడితే రాజకీయ సమీకరణాలు మారతాయనే అంచనాను విశ్లేషకులు చెబుతున్నారు.