ఆర్టీసీ సమ్మెపై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్ ... ఏమన్నారంటే
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఫలితం తర్వాత మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై, కార్మిక సంఘాల పై నిప్పులు చెరిగారు.
కార్మిక సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టారని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. ఇక ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయం కానీ, కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే విషయం కానీ మాట్లాడకుండా విలీనానికి అవకాశమే లేదని తేల్చిపారేశారు. అంతేకాదు ఆర్టీసీ మూసివేత దిశగా ఉంది అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఇక ఆర్టీసీ కథ ముగిసినట్టేనని చెప్పడంతో ఆర్టీసీ కార్మికులలో మరింత ఆందోళన మొదలయ్యింది. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయానికి మొదటి నుండి మద్దతుగా మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణ్ మరోమారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సమ్మెపై గతంలోనే స్పందించిన లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సరైనవి కావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ జేపీ చేసిన వ్యాఖ్యలు అప్పుడు పెను దుమారం రేపాయి. అయితే తాజాగా మరోసారి జయప్రకాశ్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి అంశాలను ప్రభుత్వానికి వదిలేసి కార్మికులు కేవలం తమ హక్కులు మరియు డిమాండ్ల గురుంచి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజల ఆలోచన విధానం కూడా ఈ రకంగానే ఉందని పేర్కొన్న ఆయన దానికి హుజూర్నగర్ ఫలితమే ఒక నిదర్శనమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకనైన కార్మికులు దీనిని పరిగణలోకి తీసుకుని వ్యవహరిస్తే కార్మికులకు మేలు జరగుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. జెపి గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానికే తన మద్ధతు తెలుపుతున్నట్లుగా ఉండటం గమనార్హం.