tpcc race: అభిప్రాయ సేకరణ పూర్తి.. పీసీసీ వద్దంటోన్న సీనియర్.. కానీ
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రకటించడమే మిగిలింది. టీ పీసీసీ చీఫ్ కోసం పలువురు నేతలు పోటీ పడగా.. ఇప్పటికే ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మధు యాష్కీ నుంచి అభిప్రాయం సేకరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ ఆయన మనసులో మాటని తెలుసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. వివాదాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలవడంతో పీసీసీ రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే కేసీ వేణుగోపాల్, ఠాగూర్లకు తన అభిప్రాయాన్ని వినిపించానని జీవన్ రెడ్డి తెలిపారు.
పీసీసీ నాకొద్దు..జీవన్ రెడ్డి
తనకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ.. ఈ సమయంలో పీసీసీ తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైకమాండ్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ నిర్ణయం మాత్రం తొందరగా తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా ఒకరిద్దరు నాయకుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఠాగూర్, కేసీ వేణుగోపాల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలిసి మర్రి శశిధర్ రెడ్డి పేరును సిఫారసు చేసినట్టు సమాచారం. అయితే పార్టీకి లాయల్గా ఉన్న వారి కుటుంబ సభ్యుల కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ వచ్చిన సందర్భంగా మర్రి పేరును అభిప్రాయ సేకరణలో పెట్టారని చర్చ జరుగుతోంది.
జానారెడ్డి అభిప్రాయ సేకరణ
సీనియర్ నేత జానారెడ్డికి అధిష్టానం నుండి కాల్ వచ్చినట్టు సమాచారం. పీసీసీ నియామకంపై జానారెడ్డి అభిప్రాయాన్ని మరోసారి ఆడిగినట్టు తెలుస్తుంది. అవసరాన్ని బట్టి జానారెడ్డిని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఢిల్లీలో లేకపోవడంతో నిర్ణయంపై పలురకాల చర్చ జరుగుతుంది. పీసీసీ పై ఎవరు కావాలన్న దానిపై అభిప్రాయం ఠాగూర్కి చెప్పామని జగ్గారెడ్డి తెలిపారు. కెప్టెన్ ఎవరన్నది సోనియాగాంధీ నిర్ణయిస్తారని..మేడం ఎవరికిచ్చినా పని చేస్తాం అని స్పష్టం చేశారు. వ్యతిరేకించే సమయం దాటిపోయిందని చెప్పుకొచ్చారు.
ఉత్తమ్తో రాహుల్ డిస్కషన్స్
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాహుల్ గాంధీ మాట్లాడతారని సమాచారం. ఇప్పటి వరకు అభిప్రాయం అడగలేదని, అడిగితే చెప్తా అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చినా... రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రకటించడం వాయిదా పడింది. ఒకటి రెండు రోజుల్లో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.