ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్టు: కేసీఆర్పై జేపీ నడ్డా ఫైర్
సీఎం కేసీఆర్పై బీజేపీ అగ్రనేతలు విమర్శలు కంటిన్యూ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరుగుతోన్న అవినీతి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్లో ఇవాళ బీజేపీ నిర్వహించిన సభలో నడ్డా మాట్లాడారు.
తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల వేళ బీజేపీ మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పారు. ప్రజలు తమపై బాధ్యతను పెంచారని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఇప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైందని చెప్పారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్కు సరైన సమాధానం చెప్పేందుకే ఇవాళ భారీసంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్కు తరలివచ్చారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము అన్నీవర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకుంటామని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.