కర్ణాటక టెర్రర్ స్పీకర్.. జైపాల్ పాడె మోస్తూ కన్నీటి పర్యంతమైన వేళ..
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ చూడటానికి కఠినాత్ముడిలా కనిపిస్తారు. ఆయన ప్రశాంత వదనంతో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి బల పరీక్ష సందర్భంగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై నిష్కర్షగా అనర్హత వేటు వేస్తున్న సమయంలో.. రమేష్ కుమార్ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. చేతికి అందిన అధికారం వెళ్లిపోతోందనే ఆగ్రహం ఆయనలో కనిపించింది. అలాంటి నాయకుడు.. కన్నీరు పెట్టుకున్నారు. చిన్న పిల్లాడిలా విలపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. 40 సంవత్సరాలుగా రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జైపాల్ రెడ్డిని తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఆరాధిస్తారు. జైపాల్ రెడ్డి మరణంతో తాను రాజకీయంగా అనాథగా మారానని రమేష్ కుమార్ చెప్పుకొన్నారు కూడా.
రాజనామా.. నేరుగా హైదరాబాద్ కు..
ఏ మాత్రం వీలు చిక్కినా తాను జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరవుతానని శనివార నాడే వెల్లడించారాయన. 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపాల్ రెడ్డికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదయం కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడియూరప్ప బలపరీక్షను నిర్వహించారు. బలపరీక్షలో ఆయన నెగ్గగానే..
వీడియో: మ్యాన్ Vs వైల్డ్: నరేంద్ర మోడీ అడ్వెంచర్
క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ సురేష్ కుమార్ చేతిలో పెట్టారు. చెప్పినట్టే ఈ మధ్యాహ్నం రమేష్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. తన రాజకీయ గురువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సిద్ధరామయ్యతో కలిసి పాడె మోసిన రమేష్ కుమార్
అంత్యక్రియల సందర్భంగా జైపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని చితి చుట్టూ తిప్పుతున్న సందర్భంగా రమేష్ కుమార్, సిద్ధరామయ్య పాడెను మోశారు. పాడెను భుజంపైకి ఎత్తుకుని ఒక చుట్టు తిరిగారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ చిన్నపిల్లాడిలా విలపించారు. మరో వైపు ఉన్న సిద్ధరామయ్య ఎలాంటి భావాన్నీ కనపర్చలేదు. గంభీరంగా ఉండిపోగా.. రమేష్ కుమార్ మాత్రం తన దుఖాన్ని దిగమింగుకోలేకపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. 35 సంవత్సరాల అనుబంధం ఉందని, జైపాల్ రెడ్డి తనను సోదరుడిగా ఆదరించారని, రాజకీయంలో మెళకువలు నేర్పించారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను తాను ఆయన నుంచి నేర్చుకున్నట్లు రమేష్ కుమార్ పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. కేంద్రమాజీ మంత్రులు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గె హాజరయ్యారు.