లీడర్ దొంగ : కర్ణాటకలో నేత.. తెలంగాణలో చోరీలు
హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఓ యువనేత పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. సొంత రాష్ట్రంలో లీడరులా ఫోజిస్తూ.. పక్క రాష్ట్రంలో దొంగతనాలు చేస్తున్నాడు. బుల్లెట్ బైక్, చేతివేళ్లకు ఉంగరాలు, ఖద్దరు చొక్కా.. ఇలా ఏమాత్రం తగ్గడు. కానీ ఇదంతా పొద్దుగూకే వరకు మాత్రమే బిల్డప్. రాత్రయిందంటే చాలు తనలోని దొంగను లేపుతాడు. 16 చోరీలు చేసినా.. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు సైబరాబాద్ పోలీసుల వలకు చిక్కక తప్పలేదు.
అక్కడ లీడర్.. ఇక్కడ దొంగ
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా బెలుర్గికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ అలియాస్ కాశప్ప స్థానికంగా రైతు సంఘం అధ్యక్షుడు. అంతేకాదు సొంత గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతున్నాడు. కర్ణాటక అధికార పార్టీ జేడీఎస్ లో ఆయన ప్రాంతానికి క్రీయాశీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న కాశప్ప మండలంలో లీడర్ గా గుర్తింపు పొందాడు. అయితే పేకాట వ్యసనం అతడిని ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. దీంతో చోరీల బాటను ఎంచుకున్నాడు.
హైదరాబాద్ పై కన్ను
దొంగతనాలు చేయడానికి డిసైడ్ అయిన కాశప్ప సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రంపై కన్నేశాడు. కర్ణాటకలో ఐతే పోలీసులకు తొందరగా దొరికిపోతాననే భయం కావొచ్చు. అందుకే తెలంగాణలోని హైదరాబాద్ పై నజర్ పెట్టాడు. అయితే తన బంధువులను పెట్టి స్థానికంగా లేడీస్ ఎంపోరియం నడిపిస్తున్నాడు. ఆ క్రమంలో సామాగ్రి కొనుగోలు కోసం తరచుగా హైదరాబాద్ కు వస్తుండేవాడు. చార్మినార్ కు వెళ్లి వచ్చిన పని ముగించుకునేవాడు. అనంతరం ఆటో ఎక్కి.. ఎంచుకున్న కాలనీల్లో చక్కర్లు కొట్టేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయాల్లో చోరీలు చేసేవాడు. అయితే దొంగతనాలు చేసే సమయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించే కాశప్ప.. మొబైల్ ఫోన్ ను ఇంట్లోనే పెట్టేవాడు. తన వెంట ఎలాంటి పరికరాలు తీసుకురాకపోవడం గమనార్హం. టార్గెట్ చేసిన ఇళ్ల సమీపంలోని నూతన భవన నిర్మాణాల దగ్గర నుంచి రాడ్స్ తదితర వస్తువులు సేకరించేవాడు. అలా చోరీ చేశాక ఎప్పటిలాగే రాత్రి బస్సెక్కి ఊరికి వెళ్లిపోయేవాడు.
పేకాటలో పోయింది.. చోరీల్లో కవర్ అయింది
ఇప్పటివరకు 16 చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు కాశప్ప. అయితే సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు పోలీస్ ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు సైబారాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 54 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి దొంగతనాలు మొదలుపెట్టిన కాశప్ప కేవలం 5 నెలల వ్యవధిలోనే 16 చోరీలు చేశాడు. మియాపూర్ పరిధిలో 6, రాజేంద్ర నగర్ లో 5, నార్సింగిలో 2, ఉప్పల్ లో 2, బాచుపల్లిలో ఒక ఇంట్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన ఆభరణాలను తన ఊరి సమీపంలోని నగల వ్యాపారి కాలాసింగ్ కు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు కాశప్ప.
ఈ లీడర్ కమ్ దొంగను పట్టుకునేందుకు సైబారాబాద్ పోలీసులు తంటాలు పడ్డారు. నిందితుడికి సంబంధించి చోరీ కేసులు లేకపోవడం దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. అయితే గతంలో చిన్న కేసులో కాశప్పను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు గుల్బర్గా జైలుకు పంపించారు. అదలావుంటే హైదరాబాద్ లో నిందితుడు చోరీలకు పాల్పడ్డ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించి అనుమానుతుడిగా గుర్తించారు. అయితే ఈ సీసీ ఫుటేజీలు చూస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఇన్ఫార్మర్ కాశప్పను గుర్తించారు. దాంతో వరుస చోరీల కాశప్ప కథ దర్యాప్తు మలుపు తిరిగింది. సైబారాబాద్ సీసీఎస్ బృందం అఫ్జల్ పూర్ వెళ్లి దర్యాప్తు చేయడంతో నిజం వెలుగుచూసింది. తొలుత నేరాల్ని అంగీకరించక లీడర్ బిల్డప్ ఇచ్చిన కాశప్ప.. పోలీసులు ఆధారాలు చూపెట్టడంతో కిమ్మనకుండా లొంగిపోయాడు. ఇతడి నుంచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యాపారి కాలాసింగ్ మాత్రం పరారీలో ఉన్నాడు.