కవిత అక్కడ నుండి పోటీ .. ఆపై మంత్రి పదవి .. సాధ్యమేనా ?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కుమార్తె కల్వకుంట్ల కవిత రూపంలో గడ్డు పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన కీలక నేతలను ఏదో ఒక రకంగా కీలక బాధ్యతలు అప్పజెప్పి సెట్ చేస్తున్న సీఎం కెసిఆర్ తన కుమార్తె కవిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. చిన్నచిన్న పదవులు ఇవ్వలేక, అత్యంత కీలకమైన బాధ్యత ఏది అప్పజెప్తే బాగుంటుందో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు.
ఏపీలో తెలంగాణా వాసులకు జగన్ పెద్దపీట .. కీలక పదవులు .. ఏపీలో హాట్ టాపిక్
కవితకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్
ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బిజెపి నుండి బరిలోకి దిగిన అరవింద చేతిలో ఘోర ఓటమి చవిచూశారు కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత. ఇక ఆ తర్వాత ఆమె పెద్దగా బయట కనిపించడమే మానేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కవిత తీవ్ర నిరాశలో ఉన్నారని పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోని కవిత తీరుతో అర్థమవుతుంది. అయితే కవిత బాధను దూరం చెయ్యటానికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశం లేదని చర్చ
అయితే కవితకు అప్పగించే బాధ్యత పైనే ప్రస్తుతం తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కవితతో పాటు పార్లమెంట్ లో చక్రం తిప్పిన ఎంపీ వినోద్ కుమార్ కు ప్రణాళిక సంఘం చైర్మన్ గా అవకాశం కల్పించి క్యాబినెట్ హోదా ఇచ్చిన కెసిఆర్, తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు తిరిగి మంత్రిగా స్థానం కల్పించారు. ఇక దీంతో కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ టిఆర్ఎస్ పార్టీకి తన తర్వాత బాస్ గా కుమారుడు కేటీఆర్ ను చూపించాలని భావిస్తున్న కెసిఆర్ కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి ఆసక్తి చూపించరు అన్న చర్చ కూడా టిఆర్ఎస్ పార్టీ నేతల్లోనే జోరుగా సాగుతోంది.
Recommended Video
హుజూర్ నగర్ నుండి బరిలోకి దించాలనే ఆలోచనలో గులాబీ బాస్
ఇక చిన్నచిన్న నామినేటెడ్ పదవులు చేయడానికి మాజీ ఎంపీ కవిత సిద్ధంగా లేరు అని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెరమీదకు వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా గెలవడంతో, హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఇక అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే టీఆర్ఎస్ తరఫున కవిత ను రంగంలోకి దింపితే ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
అక్కడ ఎమ్మెల్యే అయితే మంత్రి వర్గంలో స్థానం ఇస్తారని చర్చ
ఈ నేపథ్యంలో కవితను హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేను చేసి, మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనను సైతం సీఎం కెసిఆర్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఊహించని విధంగా కవిత ఇబ్బందులను చవిచూడాల్సి వస్తున్న తరుణంలో కవిత అక్కడి నుంచి పోటీ చేస్తుందా... ఆపై మంత్రిగా పని చేయడం సాధ్యమేనా అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. మరి ఇంతకీ బిడ్డ బాధను దూరం చేయడానికి సీఎం కేసీఆర్ ఏం చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.