హుజూర్ నగర్ లో గులాబీ విజయంపై కేసీఆర్ తనయ కవిత స్పందన
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించే హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ . గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎవ్వరూ ఊహించని విధంగా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడం టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ తీసుకొచ్చింది. ఇక ఏకంగా సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఓటర్ల తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి టానిక్ లా పనిచేస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. హుజూర్నగర్ ఎన్నికల ఫలితాలపై 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ టీఆర్ఎస్ సొంతం కావడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత స్పందించారు.
ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి టీఆర్ఎస్ కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలని కవిత ట్వీట్ లో తెలిపారు. ఇక ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని కవిత ట్వీట్ చేసారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని చూసినా అవేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మొత్తానికి హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరేసి సరికి పార్టీ నాయకులు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు.
కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏 ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు !! Jai Telangana !! Jai TRS !! Jai KCR !! #TRSForTelangana pic.twitter.com/1giKcYXeic
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2019