కేసీఆర్, జగన్ ఇద్దరూ ముదుర్లే..!! మరి వీరిద్దరిలో దేశ ముదురు ఎవరు..??
అమరావతి/హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల తెలుగు సీఎంలు కలిశారు. చెట్టాపట్టాలు వేసుకున్నారు. పూల గుత్తులు అందుకున్నారు. ఇంకేముంది..రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. ఇంతకు మించి తెలుగు ప్రజలకు ఇంకేం కావాలి. అలా జరిగితే బాగానే ఉంటుంది. కానీ.. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చెప్పినట్టుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయానికి తలూపుతూ జీ హుజూర్ అంటూ పోవటమే ఏపీ ప్రజల్లో తెలియని ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇదంతా తెలిసి చేసినా.. తెలియకుండా బుట్టలో పడినా ఆంధ్ర ప్రజల పరువును తాకట్టు పెడుతున్నారా.. అనే అనుమానాలకు మాత్రం తావిస్తోంది. ఇటు చంద్రశేఖర్ రావు, అటు విజయసాయిరెడ్డి ఇద్దరి చేతిలో జగన్ తానొక కీలుబొమ్మగా మారాడా.. అనే పుకార్లు ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో షికార్లు చేస్తున్నాయి.
ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసారు..! ఎవరి ప్రయోజనాలు నెరవేరతాయి..!!
అరవైఏళ్ల పాటు కలిసున్న తెలుగు నేల ఆరేళ్ల క్రితం వేరైంది. అప్పటి నుంచి ఏపీలో తెలంగాణ పట్ల ఒకరకమైన ద్వేషం పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్పై ఆపేక్షను తగ్గించేందుకు కారణమైంది. అయితే.. అవన్నీ కొద్దికాలం పాటు ఉండే ఎమోషన్స్ అయినా దాని తాలూకూ ఇబ్బందులు తరచూ తలెత్తుతూనే ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజులు తెలంగాణలో అభివృద్ధి.. హైటెక్ సిటీ సృష్టికర్త తానేనంటూ బాబు చెప్పటాన్ని తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు.
జగన్ మెతక వైఖరా.. వ్యూహమా..! రాష్ట్ర ప్రయోజనాల అంశంలో స్పందన ఏంటి..!!
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచింది కూడా ఇదే మాటలంటూ హస్తం నేతలకు ఇప్పటికి తెలిసిందట. అయితే కాలిన చేతులకు ఆకులేం పట్టుకుంటామంటూ సైలెంట్ అయ్యారట. అటువంటివి సెన్సిటివ్ విషయంగానే ఇరు రాష్ట్రాల ప్రజలు చూస్తుంటారు.. సునిశితంగా గమనిస్తుంటారు. ఖచ్చితంగా ఇటువంటి సందర్బంలో చంద్రశేఖర్ రావు, జగన్ కలిసి చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నా ఇబ్బంది లేదు. కానీ.. అదే చంద్రశేఖర్ రావు.. ఏపీపై పెత్తనం చేయాలని.. తన మాట చెల్లుబాటు కావాలనే ఆలోచనతో ఏపీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, రాజకీయాల్లో వేలుపెట్టాలని చూస్తే ఎంత వరకూ సహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Recommended Video
సహాయం చేసిన కాంగ్రెస్ ను కేసీఆర్ ఏం చేసారో తెలుసు..! జగన్ అప్రమత్తంగా ఉంటారా..?
టీడీపీ నేతలపై కక్ష సాధింపు, పోలవరం విషయంలో రీ డిజైనింగ్, అమరావతి భూముల వ్యవహారంలో చంద్రశేఖర్ రావు సలహాలే జగన్ పాటిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలే ప్రతిపక్ష టీడీపీకి ప్రాణం పోస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఎమోషన్స్ను మరింత రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నట్టుంది. ఇటువంటి కీలకమైన వేళ జగన్ కాస్త ఆచితూచి స్పందించాలి. పొరుగు రాష్ట్రాలతో స్నేహం ఉండాల్సిందే. అంతమాత్రాన అక్కడి సీఎంలు చెప్పినట్టుగా వినాలనే నియమం పాటించాల్సిన అవసరంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ చెప్పిందానికి జగన్ సై అంటారా...! రాష్ట్ర అవసరాల కోసం నై అంటారా..?
రాజకీయ, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఏపీ విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే అది ఏపీ ప్రజలు హర్షిస్తారు. కాదని..పార్టీకి పెద్దదిక్కు విజయసాయి.. సీనియర్ సీఎం చంద్రశేఖర్ రావు అంటూ.. వారి కనుసన్నల్లో పాలన చేస్తే మాత్రం.. ఏపీ ప్రజలు ఎంత వరకూ పాజిటివ్ గా తీసుకుంటారనేది జగన్ మోహన్రెడ్డి గమనించాలంటూ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పైకి కనిపిస్తున్నంత అమాయకుడు కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇరుగు పొరుగుతో మొదట మంచోడు అనే ముద్ర వేసుకునే తాపత్రయంలో జగన్ ఉన్నాడని, అందులో బాగంగానే సఖ్యతగా వ్యవహరిస్తున్నారు తప్ప మరో కారణం లేదని చర్చ జరుగుతోంది. రాష్ర్ట ప్రయోజనాల అంశానికి వచ్చే సరికి జగన్ తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కన్నా మొండివాడనే వాదన వినిపిస్తోంది. అంటే చంద్రశేఖర్ రావు ముదురైతే జగన్ దేశ ముదురు అనే చర్చ జరుగుతోంది.