దేశపతికి పక్కా..? పరిశీలనలో మర్రి పేరు, నాగేశ్వరరావుకు సపోర్ట్, మారిన ఎమ్మెల్సీ సమీకరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నికల కోలాహలం నెలకొంది. గవర్నర్ కోటా, గ్రాడ్యుయేషన్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం గులాబీ దళపతి కసరత్తు చేస్తున్నారు. సీటు కోసం ఆశవాహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తారని.. మూడో అభ్యర్థికి సపోర్ట్ చేస్తారని సమాచారం.
ఉద్యమకారులకు అవకాశం..
ఈ సారి తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కదంతొక్కిన ప్రజాగాయకుడు, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కళాకారుడి కోటాలో దేశపతికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
నాగేశ్వర్కు ఛాన్స్..
ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగనున్నారు. నాగేశ్వర్కు పోటీగా టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టొద్దని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మరో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం లభించే అవకాశం ఉంది. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడే మర్రి రాజశేఖర్ రెడ్డి అని తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పోటీ చేసి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీ బరిలోకి దించే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.
గోరటి వెంకన్న పేరు..
అంతకుముందు ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు వినిపించింది. ఈ క్రమంలో ఆయన సీఎం కేసీఆర్ను కలువడంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ విధానాలను బాహాటంగా విభేదించిన సందర్భాలు కూడా లేవు. ఈ క్రమంలో గోరటి వెంకన్న పేరు ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల రేసులో ముందువరసలో ఉంది. కానీ అనూహ్యంగా పేర్లు మారిపోయాయి.
ఆశవాహులు వీరే..
గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభావత్ రాములునాయక్ సీటు మార్చి 2న ఖాళీ కాగా, నాయిని నర్సింహారెడ్డి జూన్ 19న, కర్నె ప్రభాకర్ ఆగస్టు 17న ఖాళీ అయింది. కర్నె ప్రభాకర్కు మళ్లీ సీటు పక్కా అనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత నాయినిపి కూడా నిరాశపరచక పోవచ్చని చెబుతున్నారు. మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.
పీవీ కూతురు పేరు కూడా..
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తుల ఉమ, గుండు సుధారాణి, పిడమర్తి రవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, చాడ కిషన్రెడ్డి, ఆర్ సత్యనారాయణ, జీ దేవీప్రసాదరావు, బొమ్మెర రామ్మూర్తి, మర్రి రాజశేఖర్రెడ్డి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితోపాటు పీవీ కూతురు కూడా పేరు వినిపించింది. కానీ ఒక్కసారిగా పేర్లు మారిపోయాయి.