మంత్రులను ఖరారు చేసిన కేసీఆర్, చోటు దక్కింది వీరికే: హరీష్ రావు-కేటీఆర్లకు షాక్
హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెలల అనంతరం తెలంగాణ కేబినెట్ కొలిక్కి వస్తోంది. రేపు (మంగళవారం) కేబినెట్ విస్తరించనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్ భవన్లో పదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదిమందికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. జాబితాలో ఉన్న వారికి ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని చెప్పారు.
రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, మల్లారెడ్డిలు ఉన్నారు.
కేసీఆర్ కేబినెట్లో ఐదుగురు రెడ్డి, ముగ్గురు బీసీలతో పాటు వెలమ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు కల్పించారు. రెండు నెలల క్రితమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన హోంమంత్రి అయ్యారు.
అందరూ ఊహించినట్లుగానే కేబినెట్లో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావులకు చోటు దక్కలేదు. ఈటల రాజేందర్కు కూడా చోటు దక్కదని భావించారు. కానీ ఆయనకు కేసీఆర్ అవకాశమిచ్చారు. హరీష్, కేటీఆర్లకు చోటు దక్కకపోవడంపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ను తెలంగాణలో, పార్టీలో కీలకం చేసేందుకు ఆయనతో పాటు హరీష్ రావును పక్కకుపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరికి అవకాశమిచ్చి మరొకరికి ఇవ్వకుండే ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఇద్దరిని పక్కన పెట్టి, క్రమంగా కేటీఆర్ను క్రీయాశీలకం చేయనున్నారని అంటున్నారు.