కూతురు కోసం కేసీఆర్ సంచలనం..! ట్రబుల్ షూటర్ ను రంగంలోకి దించబోతున్న గులాబీ బాస్..!!
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన కూతురు, పార్టీలో నంబర్-3గా ఉన్న కల్వకుంట్ల కవితను దారుణంగా ఓడించారు. ఎవరు ఓడినా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. కానీ, అధికార పార్టీలో కీలకంగా ఉన్న కవిత, అందులోనూ ముఖ్యమంత్రి కుమార్తె.. ఓడిపోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అందులో గత డిసెంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 88 స్థానాల్లో ఘన విజయం సాధించి ఎదులేని గులాబీ పార్టీగా అవతరించి, మంచి ఊపు మీదున్న తరుణంలో కవిత ఓటమిని భరించలేక పోతున్నారు ఆమె అభిమానులు. ఇప్పుడు ఆమె రాజకీయ భవిత కోసం తెలంగాణలో ట్రబుల్ షూటర్ ను రంగంలోకి దించాలని మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు చంద్రశేఖర్ రావు.
క్రియాశీల రాజకీయాల్లోకి కవిత..! ప్రణాళిక రచిస్తోన్న కేసీఆర్..!!
అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన నేపథ్యంలో కవిత ఓటమి దేశవ్యాప్తంగా రాజకీయ పరిశీలకులకు ఆసక్తిని పెంచింది. 'కేసీఆర్ కూతురు కవితను ఓడించాడా...? ఎవరతను...?' అని, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ గురించి బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ.. ఆరా తీశారు. ఈసారి కవిత గెలిస్తే, పార్లమెంటులో ఆమెనే కీలక నేతగా ఉండేవారు. పార్లమెంటరీ నేతగానో, ఉప నేతగానో ఉండేవారు. టీఆర్ఎస్ ఎంపీలపై ఆధిపత్యం చెలాయించేవారు. కాని విధి కవిత పట్ల మరో రాతను రాసింది.
కలచి వేస్తోన్న కవిత ఓటమి..! వేదన చెందుతున్న ఫాన్స్..!!
కవిత ఓటమితో అనుకున్నవన్నీ రివర్సయ్యాయి. ఓడిన తర్వాత నుంచి మొన్నటివరకు కవిత బయటకు రాలేదు. కేవలం ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు. మీడియా కంటపడలేదు. తన ఓటమిని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తతో ఆమె బయటకు రాక తప్పలేదు. ఆ కార్యకర్త గ్రామానికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. 'నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం' అని బహిరంగ ప్రకటన చేసారు.
తండ్రిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న కేసీఆర్..! కవిత భవితపై వ్యూహం రచిస్తోన్న బాస్..!!
బయటకు ఏమని చెప్పినా, ఎన్ని చెప్పినా సరే. నిజామాబాద్ ఓటమితో ఆమె మాత్రమే కాదు, ఆమె తండ్రి చంద్రశేఖర్ రావు కూడా నైరాశ్యంలో కూరుకుపోయారట. అందుకే, తన కూతురును ఎలాగైనా సరే... మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాట్టు తెలుస్తోంది. ఆమెను రాజ్యసభకు పంపిద్దామనుకున్నారట. కానీ, అలా దొడ్డిదారిన వెళితే విశ్వసనీయత ఉండదన్న భయంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారట. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తేనే సత్తా చాటుకున్నట్టు అవుతుందని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ..! హరీష్ కు బాద్యతలు అప్పజెప్పనున్న కేసీఆర్..!!
హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కవితను నిలబెట్టాలని, ఆమెను గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఆమె గెలవగానే, మహిళా కోటాలో మంత్రి పదవి కూడా ఇవ్వాలని కూడా చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.