కేసీఆర్ మనసు ఫతేమైదానమంత విశాలం..! క్లిష్ట సమయంలో కూడా పాతిక వేల సాయం..!!
హైదరాబాద్ : రాజకీయాల్లో సాయం ప్రకటించాలన్నా, సంక్షేమపథకాలు అమలు చేయాలన్నా హోదా ఉంటే సరిపోదు. దానికి తగ్గ గుండె ధ్యైర్యం, తెగింపు ఉన్నప్పుడే ఆ హోదాకు అందం, ఆకర్షణ వస్తుంది. యావత్ మానవాళిని కరోనా మహమ్మారి కుమ్మేస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఆర్ధిక లావాదేవీలు పూర్తిగా ఆపన్న హస్తం కోసం చాలా దేశాలు, రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కాని అలాంటి పరిస్థితులకు పూర్తి విరుద్దంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రైతు రాజ్యం, రూ.25 వేల లోపు రుణాలకు నిధులు, రైల్వేకు రూ.4 కోట్లు: కేసీఆర్
తొలకరి ఏరువాక కోసం రైతుల ఖాతాల్లో నిధులు.. ఆదేశాలు జారీ చేసి సీఎం..
కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేస్తూనే రైతు సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రాబోయే వర్షాకాలంతో తొలకరి ఏరువాక పనులు మొదలవుతున్న నేపధ్యంలో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రతిరైతు కళ్లల్లో ఆనందం నింపాలని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం గురువారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వానాకాల పంటకు రైతు బంధు సాయం పైన మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు.
25వేల బ్యాంకు రుణం మాఫీ.. 1200కోట్ల నిధులు విడుదల..
రాష్ట్రంలో నెలకొన్న అత్యంత క్లిష్ట సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలోనూ చంద్రశేఖర్ రావు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరికొన్ని రోజులపాటు దేశంతో సహా రాష్ట్రంలోనూ లాక్ డౌన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గురువారం జరిపిన సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నరని తెలుస్తోంది. ఇక ఇదే నిర్ణయం పట్ల తెలంగాణ రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలి.. ఆదేశించిన కేసీఆర్..
25 వేల రూపాయలలోపు వున్న రైతు రుణాలను ఏకకాలంగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆమేరకు 1200 కోట్ల రూపాయలు గురువారం విడుదల చేశారు. వెను వెంటనే రైతు పేర్లతో ఉన్న ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించారు. మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో వానాకాలం పంటల పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా చిన్న సన్నకారు రైతులందరికీ చేతుల్లో డబ్బులుండాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ రావు బృహత్కర నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక, వ్యవసాయ శాఖ సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రెండు శాఖల అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యం.. అందుకోసమే ప్రభుత్వ తాపత్రయమన్న సీఎం..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ వెంటనే విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 25 వేల లోపు రుణం ఉన్న వారి అకౌంట్లలో వెంటనే రుణ మొత్తాన్ని జమ చేయాలన్నారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. ఇందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. దీంతో వచ్చే ఏరువాకను రైతులు అత్యంత సంతోషకర వాతావరణంలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.