కేసీఆర్ టోటల్ ఫెయిల్యూర్ సీఎం..! టీఆర్ఎస్ ఏడాది పాలనపై మండిపడ్డ బీజేపి..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై బీజేపి సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రెండోసారి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవంత్సరం పూర్తయిన సందర్బంగా ఆయన వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవనం గడిపారు తప్ప ప్రజోపయోగమైన ఏ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాల అభ్యుదయంకోసం ఎన్నో పథకాలను ప్రకటించిన చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. ఏడాది కాలంగా సీఎం చంద్రశేకర్ రావు ఓ ఫెయిల్యూర్ సీఎం గా ముద్ర వేసుకున్నారని ఇంద్రసేనా రెడ్డి ఘాటుగా విమర్శించారు.
కేటీఆర్ సీఎం..కేసీఆర్ సూపర్ సీఎం:తనయుడి పట్టాభిషేకానికి రంగం సిద్ధం?
రెండవాసారి సీఎం గా కేసీఆర్ అట్టర్ ఫ్లాప్.. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం లేదన్న ఇంద్రసేనా రెడ్డి..
తెలంగాణ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పాలన పడకేసిందని, శాంతిభద్రతలు కూడా పకడ్బందీగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి ప్రజా జీవితానికి దూరంగా ఉండడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం, సీఎంగా చంద్రశేఖర్ రావు రెండోసారి ఏడాది కాలం పూర్తి చేసుకున్నప్పటికి సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని మండిపడ్డారు. అదికారం కోసం అమలు కాని హామీలను ప్రకటించి తర్వాత చంద్రశేఖర్ రావు మొహం చాటేసారని ఎద్దేవా చేసారు.
నిధుల అంశంలో కేంద్రంపై నిందలు.. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనన్న బీజేపి..
ఇదిలా ఉండగా కేంద్ర బీజేపి ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకుండా వివక్ష చూపుతోందన్న సీఎం చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలను ఇంద్రసేనా రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నివేదిక ద్వారా సుమారు ఇంత అవసరం ఉంది అని పేర్కొనకుండా, కేంద్రం నిధుల అంశంలో వివక్ష చూపుతోందని నిందలు వేయడం సరైంది కాదని అభిప్రాయ పడ్డారు ఇంద్రసేనా రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రం పైన అవస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను భ్రమల్లో పెట్టి పరిపాలించడం చంద్రశేఖర్ రావుకు కొత్తేమీ కాదని వివరించారు.
ఐక్యతగా ఉంటే కేసీఆర్ కు గిట్టదు..అందుకే ఆర్టీసి నేతల్లో లో చిచ్చుపెట్టారన్న ఇంద్ర..
తెలంగాణలో కార్మికుల ఐక్యతను దెబ్బతీసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ప్రయివేటు రంగ పరిశ్రమల్లో, పబ్లిక్ రంగ సంస్థల్లో కార్మిక యూనియన్లు, యూనియన్లకు నాయకులు ఉండడం సర్వ సాధారణమని, అది చట్టంలోనే పొందుపరిచి ఉందని ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేసారు. ఎవరైనా నలుగురు వ్యక్తుల ఏకమైనా, నలుగురు కార్మికులు సంఘటితమైనా చంద్రశేఖర్ రావుకు అభద్రతాభావం ఏర్పడుతుందని, వారిని విడదీసేందుకు కుట్రలు పన్నుతారని మండిపడ్డారు. ఆర్టీసి కార్మికుల అంశంలో ఇదే జరిగిందని, కాని చంద్రశేఖర్ రావు చేసింది వందకు వంద శాతం చట్ట వ్యతిరేకమని ఇంద్రసేనా రెడ్డి అభివర్ణించారు.
మద్యం ధరలు పెంచడం దారుణం.. అక్రమ రవాణాను ప్రోత్సహించడమేనన్న సీనియర్ నేత..
తెలంగాణాలో దశల వారీగా మద్యాన్ని నియంత్రించాల్సింది పోయి మద్యం ధరలను పెంచడం దారుణమైన చర్య అని ఇంద్రసేనా రెడ్డి వివరించారు. తాగుడుకు బానిసలైన యువత సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి కూడా మద్యం కారణమవుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. మద్యం ధరలను పెంచడం మంటే అక్రమ మద్యానికి దారులు తెరిచినట్టేనని అన్నారు. సామాన్యులు మద్యాన్ని కొనుక్కోలేక పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా రవాణా చేసుకుంటారని, దీన్ని నియంత్రించాల్సింది ఎవరని ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. ఒక్క మద్యం అంశంలోనే కాకుండా అన్ని రంగాల్లో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం విఫలమైందని ఇంద్రసేనా రెడ్డి అభివర్ణించారు.