మున్సిపోల్స్పై గులాబీ దళపతి దృష్టి : కలిసి పనిచేయాలని శ్రేణులకు ఆదేశం
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త ప్రజా వ్యతిరేకత ఎదురవడంతో .. మిగతా ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. వచ్చే నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున .. మెజార్టీ స్థానాలు సాధించాలని వ్యుహరచన చేస్తోంది. అంతేకాదు ఈ నాలుగున్నరేళ్లు సంక్షేమ పాలన అందిస్తే 2023లో కూడా తమదే అధికారం అనే ధీమాతో ఉంది.
కారు జోరు ..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కారు జోరు మీదుంది. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టంచేశారు. నిన్న తెలంగాణ భవన్లో పార్టీ పటిష్టత, సభ్యత్వ నమోదుకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల కోసం నేతలు అభిప్రాయ బేధాలు వదిలి పనిచేయాలని సూచించారు. సమన్వయంతో కలిసి పనిచేసి .. పార్టీ ఉన్నతి కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి బాసట అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
4 సీట్లకే ..
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తి అని మరోసారి స్పష్టంచేశారు కేసీఆర్. తమను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని శ్రేణులకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే ఏదో జరిగిపోతుందని బీజేపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని .. గ్రేటర్ హైదరాబాద్లో కొన్నిచోట్ల ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని గుర్తుచేశారు. ఆ పార్టీని, నేతలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న హైదరాబాద్, మిగతా నగరాలు, పట్టణాలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఆయా చోట్ల పార్టీ పరిస్థితి మెరుగుపడితే .. విజయం ఖాయమని తేల్చిచెప్పారు.
కలిసికట్టుగా ...
వచ్చే నెలఖారులో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రేణులకు కేసీఆర్ అలర్ట్ చేశారు. ఆయా నగరపాలికల్లో పార్టీ బలోపేతం కృషిచేయాలని పేర్కొన్నారు. దీంతో పార్టీ మరింత బలపడి కార్పొరేషన్, మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. లేదంటే కొన్నిచోట్ల తమ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు కేసీఆర్. అందరూ కలిసి పనిచేయాలని, విభేదాలకు తావులేదని .. సమస్య ఉంటే తనతో చెప్పాలని స్పష్టంచేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.