కేసీఆర్ హిందుత్వ లెక్కలు.. అందుకేనా వాటికి దేవతల పేర్లు.. బీజేపీని ఢీ కొట్టడానికేనా?
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతోందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇలాకాలో మరో 20 ఏళ్లదాకా ఢోకా లేదనుకున్న టీఆర్ఎస్కు.. బీజేపీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని అర్థమైందా? రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా చేయాలని కలలుగన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తుగడలకు బ్రేకులు పడుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు నిలువుటద్దంలా నిలుస్తున్నాయి.
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒకప్పటి మాట. ఇప్పుడేమో సీన్ రివర్స్లా కనిపిస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఆ క్రమంలో తెలంగాణలో హిందూత్వ పోటీ నడుస్తుందా అనే అనుమానం తలెత్తుతోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ కొత్త మంత్రం జపిస్తున్నారనే వాదనలు జోరందుకున్నాయి.
కరీంనగర్ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయశక్తిగా బలపడిన టీఆర్ఎస్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అదే ఊపుతో రాష్ట్రంలో విపక్షం అనే మాట లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కారెక్కించి.. అసెంబ్లీలో హస్తం నోరుకు కళ్లెం వేశారు. అంత పకడ్బందీగా వ్యూహాలకు పదును పెడుతూ దూసుకెళుతున్న గులాబీ వనానికి.. ఇప్పుడేమో బీజేపీ రూపంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీని క్రాస్ చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ జోరందుకుంది.
లోక్సభ ఎన్నికల వేళ కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించిన తీరు వివాదస్పదమైంది. హిందూగాళ్లు, బొందూగాళ్లు అంటూ ఆయన మాట్లాడిన తీరు అప్పట్లో దుమారం రేపింది. ఎంఐఎంతో పరోక్ష దోస్తానా నేపథ్యంలోనే ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణలోని మూడు ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో పడటం.. కేసీఆర్ మాటల తీరుకు నిదర్శనమనే ప్రచారం జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో కాషాయం జెండా రెపరెపలాడటంతో బీజేపీ బలం పుంజుకున్నట్లైంది.
మోత్కుపల్లి ఎజెండా ఖరారైందా.. ఇక ఆ జెండాయేనా?
సారు, కారు, పదహారు తేడా కొట్టిందిగా..!
కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూగాళ్లు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. సారు, కారు, పదహారు అంటూ తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని టీఆర్ఎస్ నేతలు అదరగొట్టారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ఇదే మంత్రం జపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించిన పార్టీ సన్నాహాక సమావేశాల్లోనూ సారు, కారు, పదహారు అంటూ క్యాడర్కు నూరిపోశారు. కానీ, ఫలితాలు తేడా కొట్టాయి. 16 స్థానాలపై కన్నేసి క్లీన్ స్వీప్ చేస్తామని కలలుగన్న టీఆర్ఎస్ నేతల ఆశలపై ఓటర్లు నీళ్లుజల్లారు. కేవలం 9 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. బీజేపీకి నాలుగు, కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు అప్పజెప్పారు.
లోక్సభ ఎన్నికలతో బలం పుంజుకున్న బీజేపీ
లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ బలం పుంజుకున్నట్లైంది. దాంతో బీజేపీ కింగ్ మేకర్గా ముద్రపడ్డ అమిత్ షా కన్ను తెలంగాణపై పడింది. ఆ క్రమంలో ఆపరేషన్ కమలం స్పీడప్ చేస్తున్నారు. దాంతో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు కాషాయం కండువా కప్పేస్తున్నారు. ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పల్లెల నుంచి మొదలు పట్టణాల దాకా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలామంది బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నారు. అంతేకాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడి కాషాయం దండు అధికారంలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో కీలకంగా మారి బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఆ క్రమంలో బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ నేతలు షాక్ అవుతున్నారనే కామెంట్లు కొకొల్లలు. అందుకే కేసీఆర్ కొత్త మంత్రం జపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని నిలువరించడానికి కరీంనగర్ సభలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.
వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!
హిందూత్వ పోటీ నడుస్తోందా.. అందుకేనా కేసీఆర్ నిర్ణయం ఇలా..!
కరీంనగర్ సభలో హిందూగాళ్లు, బొందూగాళ్లు అంటూ కేసీఆర్ మాట్లాడిన తీరుతో టీఆర్ఎస్కు బాగా డ్యామేజీ జరిగిందనే వాదనలు లేకపోలేదు. దానిపై పెద్ద దుమారమే రేగినప్పటికీ కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ నేతలు గానీ ఎవరూ స్పందించలేదు. అందుకే ఆ తప్పును లోలోపల సరిదిద్దుకుని బీజేపీకి చెక్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా కాళేశ్వరంలోని బ్యారేజీలకు హిందూ దేవతల పేర్లు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంప్హౌజ్కు లక్ష్మి పేరుతో నామకరణం చేశారు. అన్నారం బ్యారేజీతో పాటు సిరిపురం పంప్హౌజ్కు సరస్వతి పేరు పెట్టారు. సుందిళ్ల బ్యారేజీతో పాటు గోలివాడ పంప్హౌజ్కు పార్వతిగా నామకరణం చేశారు. నందిమేడారం రిజర్వాయర్ కమ్ పంప్హౌజ్కు నంది పేరు, లక్ష్మిపురం పంప్హౌజ్కు గాయత్రి పేరు పెట్టారు. అదలావుంటే కేసీఆర్ నయా మంత్రంతో తెలంగాణలో హిందూత్వ పోటీ నెలకొందనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టాలనే కొత్త మంత్రదండం ఎంతమేర పనిచేస్తుందో చూడాలి మరి.