తెలంగాణలో పాలన గాడిలో పెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం.. 8 కొత్త కమిటీల ఏర్పాటు
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించడానికి శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇక అందులో భాగంగా వైద్య ఆరోగ్య కమిటీ, గ్రామీణ పారిశుద్ధ్య కమిటీ, పట్టణ పారిశుద్ధ్య కమిటీ, వనరుల సమీకరణ కమిటీ, పచ్చదనం కమిటీ , వ్యవసాయ కమిటీ, పౌల్ట్రీ కమిటీ, సంక్షేమ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పని చేయాలని నిర్ణయించింది.
ఆ మూడు కులాలతో కేసీఆర్ కు ముప్పే..! హుజూర్నగర్లో గులాబీ పరిస్థితి?
శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాల ఏర్పాటు
మంత్రివర్గ భేటీలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడానికి, ఎప్పటికప్పుడు వివిధ శాఖల పనితీరును పర్యవేక్షించడానికి, వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వానికి తగు సూచనలు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని నిర్ణయించిన మంత్రిమండలి వివిధ శాఖలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు అమలవుతున్న సరళి తెలుసుకునేందుకు , అమలు సరిగ్గా జరిగేందుకు ఈ కమిటీలు పని చెయ్యనున్నాయి.
వైద్య శాఖ పనితీరు పర్యవేక్షణకు వైద్య ఆరోగ్య కమిటీ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఈ కమిటీ పని చేస్తుంది. ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సీజనల్ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాఖ పనితీరుని వైద్య ఆరోగ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కమిటీ దోహదపడుతుంది.
పట్టణ పారిశుద్ధ్య మరియు గ్రామీణ పారిశుద్ధ్య కమిటీలు
మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితాఇంద్రారెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుద్ధ్య కమిటీలో పని చేస్తారు . పట్టణాలు పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ పనితీరును పర్యవేక్షించేందుకు ఈ కమిటీ పని చేస్తుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షుడిగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా గ్రామీణ పరిశుద్ధ కమిటీని ఏర్పాటు చేసింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు లోనూ, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక విషయంలోనూ ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ రెండు కమిటీలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి పని చేస్తాయి.
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయ కమిటీ
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షుడిగా మంత్రులు గంగుల కమలాకర్ ,జగదీష్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా వ్యవసాయ కమిటీ ఏర్పాటైంది. రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడటం, కల్తీలను నివారించడం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు అమలు చేయడం అలాగే విత్తనాలు ఎరువులు సేకరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడటం , ఇక పంటల కొనుగోలు, గిట్టుబాటు ధరలు వంటి అన్ని అంశాలపై ఈ కమిటీ పని చేస్తుంది. వ్యవసాయ శాఖ పనితీరు మెరుగుపరచటం కోసం ఈ కమిటీ ఏర్పాటయింది.
వనరుల సేకరణ , పచ్చదనం కమిటీలు
ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం రాష్ట్ర స్థాయిలో వనరులను సేకరించడానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ అధ్యక్షుడిగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి, అడవులను కాపాడటానికి, కలప స్మగ్లింగ్ ను అరికట్టడానికి పచ్చదనం కమిటీ ని ఏర్పాటు చేసారు మంత్రిమండలి. ఇక ఈ పచ్చదనం కమిటీలో అటవీ శాఖ మంత్రి అధ్యక్షుడిగా మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి లు సభ్యులుగా ఉంటారు.
పౌల్ట్రీ పరిశ్రమ పటిష్టం కోసం, సాంఘిక సంక్షేమం కోసం కమిటీలు
ఇక పౌల్ట్రీ పరిశ్రమ పటిష్టం చేయడం కోసం, పౌల్ట్రీ పాలసీ తీసుకోవడంతో పాటుగా పౌల్ట్రీ అభివృద్ధికి తీసుకున్న చర్యలను పర్యవేక్షించడానికి పౌల్ట్రీ కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షుడిగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి లు సభ్యులుగా పౌల్ట్రీ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించటానికి సంక్షేమ కమిటీ ని ఏర్పాటు చేసారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షుడిగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా ఈ కమిటీ పని చేస్తుంది. ఇలా వివిధ శాఖల పనితీరును పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేసే నిరంతరాయంగా అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తెలంగాణ క్యాబినెట్.
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై అక్టోబర్ 10న భేటీ
గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించడానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామాల్లో అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో కూడా చేయాల్సిన పనుల పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ సమావేశానికి డిపిఓలను, డిఎల్పివోలను కూడా ఆహ్వానించారు. మొత్తానికి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పనితీరు మెరుగు పరచడం కోసం కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల నిర్ణయాల మేరకు పనిచేయాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్.