రాష్ట్ర బడ్జెట్ లో జాతీయ అంశాలను వల్లె వేసిన కేసీఆర్..!ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి అదే కారణమన్న సీఎం
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గ విస్తరణ తరువాతి రోజే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శాసనసభలో 2019- 2020 కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమర్పణ సందర్భంగా చేసిన ప్రసంగం వింటున్నవారికి అది తెలంగాణ బడ్జెట్టా..? కేంద్ర బడ్జెట్టా అన్న అనుమానం కలిగింది. ఆయన తన ప్రసంగం ప్రారంభించగానే, దేశ జీడీపీ గణాంకాలు, వృద్ధిరేటు పతనం, విమానయానం, ఆటో మొబైల్ ఇండస్ట్రీల అభివృద్ధి క్షీణించడం, నిరుద్యోగం పెరిగిపోతుండడం, ఆర్థిక మాంద్యం గురించి చెప్పుకొంటూ పోయారు. దీంతో వింటున్నవారంతా చంద్రశేఖర్ రావు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారా ఏంటి అంటూ గుసగులాడుకోవడం కనిపించింది.
బడ్జెట్ 1 లక్ష 46 వేల 492 కోట్లు .. పద్దుపై ఆర్థికమాంద్యం ఎఫెక్ట్... ఓటాన్ కంటే తగ్గిన వ్యయం
ఆర్థిక కేటాయింపులు..! కేంద్ర అంశాలతో ముడిపెట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్..!!
కాగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు బడ్జెట్ అంశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో, మునుపటిలా బడ్జెట్లో ఎడాపెడా కేటాయింపులు చేయడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. కానీ, ఒక్కసారిగా కేటాయింపులు కుదిస్తే జనం నుంచి వ్యతిరేకత.. మేధావి వర్గం నుంచి విమర్శలు.. వ్యతిరేక విశ్లేషణలు వస్తాయి కాబట్టి ఇదంతా తన తప్పేం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇలా వెళ్తున్నామన్నట్లుగా ఆయన కేంద్రంపై నిందలేస్తూ పావుగంట పాటు దేశ ఆర్థిక పరిస్థితిని వివరించుకుంటూపోయారు. ఆ తరువాత తెలంగాణ లెక్కల్లోకి వచ్చారు.. అప్పుడు కూడా కేంద్రం నుంచి ఏమీ రావడం లేదంటూ ప్రతి రంగంలోనూ కేంద్రంపై నిందలేస్తూ వెళ్లారు. మరి.. ఈ బడ్జెట్పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
కేటాయింపులకు కోత..! కేంద్రంపై నెపం మోపే యత్నం..!!
కాగా... గత ఫిబ్రవరిలో సభలో ఆమోదించిన ఓటాన్ అకౌంట్ పద్దు సెప్టెంబర్ 30న ముగియడంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచింది అని చెప్పడం, తమ వైఫల్యాలను కూడా కేంద్రంపై వేసే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రతిష్ఠాత్మక పథకాలు నిరర్థకమైన పథకాలుగా అభివర్ణించడంతో బీజేపీ నేతలు ఎలా ప్రతిస్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ప్రయోగాల జోలికి వెళ్లని కేసీఆర్..! శాఖలు పక్కాగా కేటాయించిన సీఎం..!!
అంతే కాకుండా కేబినెట్ విస్తరించి, మొత్తం మంత్రి వర్గాన్ని తెర మీదకు తీసుకొచ్చిన చంద్రశేఖర్ రావు, ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదన్నట్లుగా వ్యవహరించారు. అందరూ ఊహించినట్లే హరీశ్ కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పజెప్పిన చంద్రశేఖర్ రావు, కొడుక్కి మాత్రం గతంలో ఆయన నిర్వహించిన శాఖల్నే(ఐటీ.. మున్సిపల్.. పరిశ్రమలు) కేటాయించారు. దీంతో, సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ ను సీఎం చంద్రశేఖర్ రావు, మండలిలో ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ ప్రవేశ పెట్టారు. మిగిలిన వారి విషయానికి వస్తే, గతంలో హోంమంత్రిగా వ్యవహరించిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖను.. సత్యవతి రాథోడ్ కు గిరిజనాభివృద్ధి.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖను, పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణా శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హరీష్ శాఖ పట్ల అభిమానుల అసంతృప్తి..! ప్రజాసంబంధాలు అంతగా ఉండవంటూ ఆవేదన..!!
తాజా మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావుకు మంచి పదవి దక్కినా, హరీష్ అభిమానులు సంతోషంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే, అది కీలకమైన పదవే గాని నేరుగా ప్రజలతో సంబంధాలు నెరపే పదవి కాదని, జలవనరుల శాఖ మంత్రిగా హరీష్ శ్రమ జనాలకు కనిపించినట్టు ఆర్థిక శాఖలో హరీష్ శ్రమ జనాలకు తెలియదనే చర్చ జరుగుతోంది. అది మేథో శాఖ. హరీష్ వంటి ప్రజా సంబంధాలు నెరపే వ్యక్తి ఆ శాఖ వల్ల ఉపయోగం లేదు అన్నది వారి వాదన. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడు హరీష్ రావు, ప్రాజెక్టుల చుట్టు తిరిగేవారు. వాటి పని అయ్యేదాక వెంట పడేవారు. కానీ ఆర్థిక శాఖ అంటే ఫైళ్లపై సంతకాలు పెట్టే వరకే పరిమితం అవుతారని, ప్రజల్లో తరచూ తిరగలేరనేది హరీష్ అనుచరుల్లో నెలకొన్న ఆవేదనగా తెలుస్తోంది.