జగన్ తొలి విజయం: చంద్రబాబుకు ఇదే సమాధానమా: కేసీఆర్ కీలక ప్రకటన..ఇక ఆ విషయంలోనూ..!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తొలి విజయం. నాడు చంద్రబాబు చేయలేనిది..ఇప్పుడు జగన్ చేసి చూపించారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన సవాళ్లకు నేడు జగన్ సమాధానం చెప్పారు. కేసీఆర్ ఏపీకి అన్యాయం చేసారని..అటువంటి కేసీఆర్తో జగన్ మైత్రి కోరుకుంటున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోలవరం పైన కేసులు వేసిన కేసీఆర్తో జగన్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్తో పోలవరం మీద కేసులు ఉపసంహరించుకొనే లా చేసి తన సామర్ద్యం చాటుకోవాలని సవాల్ చేసారు. ఇప్పుడు జగన్ అదే చేసారు. కేసీఆర్ అందుకు అనుగుణంగా ప్రకటన చేసారు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ తొలి విజయం సాధించారు.
పోలవరం కేసుల ఉపసంహరణ : కేసీఆర్ ప్రకటన..
ఏపీ ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం పైన వేసిన కేసులను ఉపసంహరించకుంటామంటూ ప్రకటించారు. ప్రగతి భవన్ లో అధికారుల సమక్షంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఉన్న వేళ..కేసీఆర్ ఈ ప్రకటన చేసారు. సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం మీద మనం వేసిన కేసు త్వరలో కోర్టు విచారణకు రానుంది. దీనిపై ఇప్పుడు మన విధానం ఎలా ఉంటుంది అని ఆయన కేసీఆర్ ను అడిగారు. ఈ సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. పోలవరంపై వేసిన కేసులను ఉపసంహరించు కుంటాం అని చెబుతూనే.. ప్రాజెక్టు నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా అవసరమైతే ఏపీతో కలిసి ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్తో సంప్రదింపులు కూడా జరుపుతాం అని కేసీఆర్ పేర్కొనగానే ఏపీ అధికారులు హర్షధ్వానాలు చేసారు. దీనిని జగన్ స్వాగతించారు.
చంద్రబాబుకు ఇదే సమాధానం..
జగన్-కేసీఆర్ సఖ్యత మీద నాడు ఎన్నికల ప్రచారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఆరోపణలు చేసారు. ఏపీ పైనా..అక్కడి ప్రజలను అవమానించేలా వ్యవహరించిన కేసీఆర్తో జగన్ ఎలా సంబంధాలు పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు. అదే సమయంలో పోలవరం పైన కేసీఆర్ కేసులు వేయించారని..ఏపీకి కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆయన వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా సైతం ఇదే రకంగా వ్యాఖ్యలు చేసారు. సుప్రీంకోర్టులో కేసులు వేసిన కేసీఆర్తో స్నేహమా అని ప్రశ్నిస్తూనే..జగన్కు చేతనైతే ఆ కేసులను ఉప సంహరించుకొనే చేయాలని డిమాండ్ చేసారు. ఇక, ఇప్పుడు జగన్ అదే చేసారు. కేసీఆర్తో సఖ్యతగా ఉంటూ ఇచ్చి పుచ్చుకొనే ధోరణికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపారు. స్వయంగా కేసీఆర్ తనంతట తానుగా పోలవరం పైన వేసిన కేసులను ఉప సంమరించుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఏపీకి మద్దతుగా ఒడిశా సీఎంతో మాట్లాడుతామని చెప్పటం ద్వారా..టీడీపీ నేతలు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ తన దౌత్యం ద్వారా తొలి విజయం సాధించారు.
ఇక..ఆ విషయంలోనూ కేసీఆర్తో..
ఇప్పుడు పోలవరం కేసులను ఉప సంహరించుకోవాలని కేసీఆర్ నిర్ణయించటంతో..ఇప్పుడు మరో విషయంలోనూ కేసీఆర్ను ఒప్పించే బాధ్యత జగన్ మీద ఉంది. ఏపీకి కీలకమైన పోలవరంతో పాటుగా ఏపీకి ప్రత్యేక హోదా విషయం లోనూ ఇప్పుడు కేసీఆర్ మద్దతుగా లేఖ రాయాల్సి ఉంది. గతంలోనే ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. ఏపీకీ హోదా కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని..కేసీఆర్..నవీన్ పట్నాయక్ సైతం మద్దతుగా లేఖలు ఇస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ట్రాప్లో జగన్ పడుతున్నారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు తాజాగా పోలవరం విషయం లో తీసుకున్న నిర్ణయం ద్వారా జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఇదే సమయంలో ప్రత్యేక హోదా అంశంలోనూ కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయటం ద్వారా ఏపీ ప్రజల్లోనూ కేసీఆర్- జగన్ మైత్రి మీద ఉన్న అపోహలు తొలిగిపోతాయి. మరి..దీని మీద ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.