కేసీఆర్ ఆ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణం ... వీహెచ్ ఫైర్
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఇంకా రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది. రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇక రాజకీయ రంగు పులుముకున్న ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విజయారెడ్డి హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వ పొరబాట్లే కారణమని ఆరోపించారు.
తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్ ... విజయారెడ్డి హత్య కు సురేష్ రెక్కీ , హత్య వెనకాల వారి హస్తం ?
విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అని పేర్కొన్న ఆయన సీఎం కేసీఆర్ తీరే హత్యకు కారణం అని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖ విషయంలో ప్రవర్తించిన తీరు వల్లే ఇప్పుడు ఈ ఘటన జరిగిందని అన్నారు. అధికారులను కంట్రోల్ చెయ్యలేని ప్రభుత్వ విధానాలు వెరసి విజయారెడ్డి దారుణ హత్యకు కారణం అయ్యాయని వీహెచ్ ఆరోపణలు గుప్పించారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి ఈరోజు నివాళి అర్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు లంచం అడిగితే కొట్టాలంటూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణమని ఆరోపించారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వీహెచ్ పేర్కొన్నారు . రెవెన్యూ కార్యాలయాలకు ఒక కానిస్టేబుల్ తో భద్రత కల్పించాలని చెప్పారు. లేదంటే ప్రజలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో లోటుపాట్లు, భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.