సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ టికెట్లు .. నేడు ఆరుగురి పేర్లు ప్రకటించే అవకాశం
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల సమరశంఖంలో గెలిచేందుకు పార్టీలు వ్యుహలు రచిస్తోన్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి ప్రభావం .. ఇదివరకు చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపై సర్వేలు చేపట్టాయి. వాటి ఆధారంగా ప్రజల నాడీ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.
నియోజకవర్గానికో బహిరంగ సభ, ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో, బహుముఖ వ్యుహంతో కాంగ్రెస్
టీఆర్ఎస్ సర్వే .. నేడు ఆరుగురికి సీట్లు
రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేపట్టింది. ఆ సర్వే ఆధారంగా తొలుత ఆరు సీట్లను ఖరారు చేయాలని భావిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, భువనగిరి స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులు విజయవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ఆ పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జీ నగేశ్, కల్వకుంట్ల కవిత, వినోద్ కుమార్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇవాళ సాయంత్రం (శుక్రవారం) ఆ ఆరుగురు పేర్లతో తొలి జాబితాను సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంది.
ఆచి తూచి అభ్యర్థుల ఎంపిక
రాష్ట్రంలోని 16 స్థానాల్లో విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ .. అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ఓ చిన్న తప్పిదం పార్లమెంట్ స్థానంలో విజయవకాశాలపై ప్రభావం చూపిస్తోన్నందున కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 16 స్థానాల్లో సర్వే చేయించగా .. సిట్టింగ్ స్థానాల్లో ఎంపీల పనితీరు గురించి, అలాగే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వ్యతిరేకత .. ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తోన్న నేతల పేర్లతో కూడా సర్వే చేపట్టారు. సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్లను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎంపీలతో భేటీ .. సర్వే వివరాల వెల్లడి
శుక్ర, శనివారాల్లో సిట్టింగ్ ఎంపీలు, మిగతా స్థానాల్లో టీఆర్ఎస్ సీటు ఆశిస్తోన్న నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను వెల్లడించి .. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వివరించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ భవన్ రావాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. మరో ఐదుగురు ఎంపీలు కూడా సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొంటారని విశ్వసనీయంగా తెలిసింది.
నేడు ఫస్ట్ లిస్ట్ .. 22న తుది జాబితా
ఇవాళ ఆరుగురు సిట్టింగ్ ఎంపీలతో తొలి జాబితా విడుదల చేస్తారు సీఎం కేసీఆర్. ఈ నెల 22న మరో 10 మంది అభ్యర్థులతో తుది జాబితా ప్రకటిస్తామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల విజయవకాశాలు, సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని స్పష్టంచేశాయి.