ఆర్టీసి ఉద్యోగులను తక్కువ అంచనా వేయొద్దు..తడాఖా చూపిస్తాం: సీఎంకు అశ్వధ్దామరెడ్డి వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసి సమ్మె ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అవ్వడం, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ కార్మికుల పట్ల నివేదిక సమర్పించడం, అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రశేఖర్ రావు ఉద్యోగులు స్వీయ బహిష్కరణకు గురయ్యారని పేర్కొనడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులు గడువులోగా విధుల్లో చేరలేదు గనక వారి ఉద్యోగాలను వారే తొలగించుకున్నారని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసి నేతలు ముఖ్యమంత్రి తీరుపై భగ్గుమంటున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆదోళనలు నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ సీఎంకు సిసలైన అగ్ని పరీక్ష..! ఆర్టీసి కార్మికులతో కేసీఆర్ కు రణమా..? శరణమా..?
తెలంగాణ సర్కార్ వర్సెస్ ఆర్టీసి ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక లోకం..
ఆర్టీసి ఉద్యోగుల జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, సంస్థను బతికించుకునేందుకే సమ్మెలోకి వెళ్లామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క నియామకం చేయాలేదని, సిబ్బంది లేకుండా సంస్థ ఎలా ముందుకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీపై సీఎం చంద్రశేఖర్ రావు చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. కార్మికులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు డీజీల్ భారం తగ్గించాల్సి ఉందని, ప్రస్తుతం డీజీల్ పై 27 శాతం పన్నులు వేస్తున్నారన్నారు. సంస్థను కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీ కోసం రాష్ట్ర బంద్.. కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారన్న అశ్వత్థామ రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల నాయులు సమావేశం నిర్వహించి భవిశ్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బీజీపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం. కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు.
వెనక్కి తగ్గేది లేదంటున్న ఉద్యోగులు.. ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరినా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు ప్రభుత్వం కూడా వారి శరతులను అంగీకరించడం లేదు. దీంతో నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీనిపై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష సమావేశం జరగుతోంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించుకుంఠున్నట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మెకు వివిధ సంఘాల సంఘీభావం.. సమ్మెను ఉదృతం చేస్తామంటున్న ఉద్యోగులు..!!
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘీ భావం ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందని, వాటిని సానుభూతి తో పరిష్కరించాల్సింది పోయి అణిచి వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీయూడబ్ల్యూజే విమర్శించింది. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న కారణంగా ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. పోలీసు బలగాలను మొహరించి ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది.