కేసీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క : బడ్జెట్పై వాడీ వేడీ చర్చ
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులు, అప్పులపై లేవనెత్తిన అంశాలు చర్చకు దారితీశాయి. బడ్జెట్ కేటాయింపులు, అప్పులపై భట్టి ప్రస్తావించడంతో చర్చకు దారితీసింది. సీఎం కేసీఆర్ కల్పించుకొని .. వాస్తవాలు చెప్పాలని ... పదే పదే అబద్ధాలు వల్లెవేయొద్దని కోరారు.
భట్టి వర్సెస్ కేసీఆర్
ఆర్థిక మాంద్యం పేరు చెప్పి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఏదో సాకు చూపి పద్దు తగ్గించారని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏవని నిలదీశారు. నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పి వంచించారని ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని మభ్యపెట్టారని .. విమర్శించారు.
మాంద్యం పేరు చెప్పి
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉందని .. కానీ మాంద్యం పేరు చెప్పి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బడ్జెట్ కేటాయింపులు .. ఖర్చు మన రాష్ట్రంలో తేడా ఉందన్నారు. 34 శాతం డిఫరెన్స్ ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సామాజిక మార్పు కోసం .. ఆత్మగౌరవంతో బతికేందుకు అని ... కానీ దానిని వమ్ము చేస్తున్నారని విమర్శించారు. మిగులు బడ్జెట్ కాస్త .. దివాళ తీసిందని భట్టి కామెంట్ చేయడంతో సభలో గందరగోళం చెలరగేగింది. సీఎం కేసీఆర్ కల్పించుకొని ... భట్టి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
లేనిపోని ఆరోపణలు
బడ్జెట్ ప్రతులను చూసి చదివితే బాగుంటుందని సీఎం కేసీఆర్ సూచించారు. లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం తగదన్నారు. పదే పదే అవాస్తవాలు వల్లే వేయడం మానుకోవాలని సూచించారు. తప్పు జరిగితే చెప్పాలని .. అలా కాకుండా లేని విషయాలను ఆపాదించడం ఏంటని కేసీఆర్ పేర్కొన్నారు. భట్టి వ్యాఖ్యలు అక్కసు వెళ్లగక్కడమేనని పేర్కొన్నారు. కోత పెట్టామని మేం చెప్పాం కదా .. దానిని ప్రశ్నించడం ఏంటని అని కేసీఆర్ సభ ముందు తెలిపారు. ఆర్థిక నిపుణులను సంప్రదించే బడ్జెట్ ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. పద్దు ఎందుకు తగ్గిందో కూడా వివరించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల్లో కోత పెడితే ఏం చేయమంటారు అని నిలదీశారు.