15 కోట్ల రూపాయల వరద సహాయం చేసిన కేజ్రీవాల్ .. హైదరాబాద్ కు అండగా ఢిల్లీ సర్కార్
హైదరాబాద్ వరదలకు దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎం ల నుండి స్పందన వస్తుంది . నిన్నటికి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 10 కోట్ల రూపాయల విరాళం ఇస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని ప్రజలకు సహాయం కోసం ముందుకు వచ్చారు . తన ప్రభుత్వం సహాయక చర్యల కోసం తెలంగాణకు రూ .15 కోట్లు విరాళంగా ఇస్తుందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. హైదరాబాద్లో సహాయక చర్యల కోసం స్పీడ్ బోట్లను పంపమని ఆంధ్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే .
హైదరాబాద్ లో కంపు కొడుతున్న కాలనీలు ... డేంజర్ బెల్స్ మోగిస్తున్న విష జ్వరాలు
తెలంగాణ ప్రభుత్వానికి రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
"హైదరాబాద్లో వరదలు ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలు తమ సోదర, సోదరీమణుల కోసం ఈ సంక్షోభంలో హైదరాబాద్లోని ప్రజల పక్షాన నిలబడ్డారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి రూ.15 కోట్లు విరాళంగా ఇస్తున్నాం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ యొక్క ప్రకటన మాత్రమే కాదు , తమిళనాడు సీఎం కె పళనిస్వామి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి తెలంగాణకు రూ .10 కోట్లు విరాళంగా ఇచ్చారు. వరద బాధితుల కోసం తమిళనాడు దుప్పట్లు, చాపలు కూడా పంపుతోంది.
హైదరాబాద్ వరదలతో నష్టం అపారం ..37,409 కుటుంబాలపై ఎఫెక్ట్
తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా వరదలు రావడంతో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో సగం మంది హైదరాబాద్కు చెందినవారు కాగా మిగతా వారు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఒక ప్రకటనలో, హైదరాబాద్ వరద కారణంగా మొత్తం 37,409 కుటుంబాలు ప్రభావితమయ్యాయని పేర్కొంది .వేలాదిగా కాలనీలు నీట మునిగాయని , ప్రజలను పునరావాస కేంద్రాలలో ఉంచి వారికి కావాల్సిన వసతులు కల్పిస్తున్నామని పేర్కొంది .
10వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన కేసీఆర్ ..550 కోట్ల రూపాయల విడుదల
వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూ .10,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైన వారికి లక్ష రూపాయలు, ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైన వారికి రూ .50 వేలు ప్రకటించారు. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం వెంటనే 550 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు . తెలంగాణతో పాటు, పక్క దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక కూడా వరదలతో పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది.
అక్టోబర్ 22 వరకు వర్షాలు పడే అవకాశం... వెల్లడించిన వాతావరణ శాఖ
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) సోమవారం అంచనా వేసింది. అక్టోబర్ 22 వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది . గత కొన్ని వారాలుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత 100 ఏళ్ళలో ఎన్నడూ చూడనంతగా వర్షాలు కురవటం భాగ్యనగర వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి .