ఆ ఏనుగు మృతికి కారణమైనవారి సమాచారం ఇస్తే క్యాష్ ప్రైజ్, ఎంతో తెలుసా..?
హైదరాబాదు: మనిషిని నమ్మిన ఆ ఏనుగు మోసపోయింది. ఆహారం ఎరవేసి దాని ప్రాణాలు తీశాడు కర్కశకుడు. ఈ ఘటన ఇటు దేశాన్నే కాదు అటు ప్రపంచదేశాల్లో కూడా సంచలనం సృష్టించింది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని మల్లాపురంలో జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అసలు మానవుడికి ఉండాల్సిన మానవత్వం నశించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే ఈ గజరాజుకు ఆ పైనాపిల్ ఆహారంగా ఎరవేసి దాని మృతికి కారణమైన వారికోసం కేరళ ప్రభుత్వం వెతుకుతోంది. ఈ క్రమంలోనే ఆ మూగజంతువు ప్రాణం తీసిన వారికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా ఆఫర్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Recommended Video
Archimedes Principle:బావిలో గున్న ఏనుగు.. గ్రామస్తులు కాపాడిన తీరు భేష్..వీడియో వైరల్
భారీ బహుమానం ప్రకటించిన హైదరాబాద్ వ్యక్తి
యావత్ ప్రపంచాన్నే కదిలించేసిన కేరళ ఏనుగు మృతి ఘటనపై ఆయా దేశాల వారు కూడా స్పందిస్తున్నారు. ఇంత హేయమైన చర్యకు ఎలా దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్లో అయితే గర్భంతో ఉన్న ఈ ఏనుగు మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. హత్య చేసింది ఒక ప్రాణిని కాదని రెండు ప్రాణులనంటూ ట్విటర్లో ట్వీట్స్ కనిపించాయి. ఇక ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారో ఆ వ్యక్తి గురించి సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షలు బహుమానం ఇస్తామంటూ హైదరాబాదుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపాడు.
కేరళ సీఎంను ట్యాగ్ చేసిన శ్రీనివాస్
ఆహారం రూపంలో బాణా సంచా పేర్చి ఉంచిన పైనాపిల్ పండును ఎరగా వేసి ఆ ఏనుగు మృతికి కారణమైన ఘాతుకుడెవరో తెలిస్తే సమాచారం ఇవ్వాలంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ. రెండు లక్షలు తన జేబునుంచి తీసి బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఈ మేరకు బీజేపీ నేత మేనకా గాంధీకి కూడా ట్యాగ్ చేశాడు. మనిషి అనే వాడు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడు అని ప్రశ్నించాడు శ్రీనివాస్. మూగజీవాల పట్ల తన కర్కశాన్ని ఎలా ప్రదర్శిస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన వెనక ఉన్నవారిని పట్టుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. తన ట్వీట్ను కేరళ ముఖ్యమంత్రికి కూడా ట్యాగ్ చేసినట్లు చెప్పిన శ్రీనివాస్ ఇలా అయితే కేరళ రాష్ట్రంకు తాను ప్రకటించిన బహుమతి గురించి త్వరగా తెలుస్తుందని చెప్పాడు. సమాచారం ఇచ్చిన వ్యక్తికి తానే స్వయంగా కేరళ వెళ్లి ఆ డబ్బును అందజేస్తానంటూ శ్రీనివాస్ చెప్పాడు.
ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయని పోలీసులు
ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి కేరళ పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేశారు. అయితే ఇలా మూగ జీవాలపైన మనిషి తన దాష్టీకాన్ని ప్రదర్శించడం తొలిసారి కాదన్న శ్రీనివాస్.. గతంలో కూడా ఓ కుక్కను కొన్ని అంతస్తుల పైనుంచి కిందకు జారవిడిచిన ఘటనను గుర్తు చేశాడు. ఇది చెన్నైలో జరిగిందని చెప్పాడు. మరో ఘటనలో ఎంతో ముద్దొచ్చే కుక్కపిల్లలు బతికుండగానే మంటల్లో కాల్చేశారనే విషయాన్ని గుర్తు చేశారు.