హైకోర్టులో నేడు తేలిపోనుందా: ప్రభుత్వం తాజా అఫిడవిట్ లో ఇలా :టీయస్ఆర్టీసీ బకాయిలు రూ.2,209 కోట్లు
టీయస్ఆర్టీసీ సమ్మె పైన నేడు తీర్పు రానుందా. ప్రభుత్వం..ఆర్టీసీ జేఏసీ అదే అంచనాతో ఉన్నాయి. హైకోర్టులో సోమవారం జరిగే వాదనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలతో ఒక అఫిడవిట్ కోర్టులో దాఖలు చేస్తోంది. అందులో ఆర్టీసీ కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేయనుంది.
కానీ, ప్రస్తుత బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో రూ.47 కోట్లను కూడా కేటాయించే పరిస్థితిలో లేము. అయినా.. ఎన్నిసార్లు.. ఎంత వరకూ ఆర్టీసీని ప్రభుత్వం కాపాడగలదు అనేది తేలని అంశంగా మారిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. నేపథ్యంలో కోర్టుకు సమర్పించేందుకు ప్రభుత్వం కౌంటర్ సిద్ధం చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండని అఫిడవిట్లో సర్కారు కోర్టును కోరింది.
టీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని.. చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని, ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వం సహకరిస్తూనే ఉందని నివేదికలో పేర్కొన్నారు. సమ్మె చట్టవిరుద్ధమని కార్మిక శాఖ చెప్పినా కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు. ఆగస్టు 31నాటికి ఆర్టీసీ రూ.5,269 కోట్ల నష్టాల్లో ఉందని, బ్యాంకులు, ఇతర సంస్థలకు రూ.1,786 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.
ఆర్టీసీలో బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల కిలోమీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 13 లక్షల కి.మీ. లేదా 15 ఏళ్లకు మించి ఉపయోగించడానికి వీల్లేదని, టీఎ్సఆర్టీసీ ఏర్పడే నాటికి మొత్తం 10,460 బస్సులు ఉండగా వాటిలో 2,609 బస్సులు కాలం చెల్లినవని అఫిడవిట్లో నివేదించారు. వీటిని వెంటనే మార్చాల్సి ఉందని, లేకపోతే, ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడడమే కాకుండా పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.
హైదరాబాద్ సున్నిత ప్రాంతం కావడంతో ఇక్కడి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో వారు నిమగ్నమయ్యారు. అదే రోజు చలో ట్యాంక్బండ్ చేశారని తప్పుబట్టింది. ప్రజలకు రవాణా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందిని నియమించిందని, విధులు నిర్వర్తించకుండా ఆర్టీసీ యూనియన్లు వారిని అడ్డుకుంటున్నాయని కోర్టుకు నివేదించింది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఈనెల 8వ తేదీ వరకు మొత్తం రూ.2,209.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అఫిడవిట్లో సర్కారు స్పష్టం చేసింది.
దీంతో..ఇప్పుడు కోర్టు ఏ రకంగా స్పందిస్తుందీ.. సమస్య పరిష్కార దిశగా సూచనలు చేస్తుందా..ఈ రోజుతో సమస్య ముగిసిపోతుందా.. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందా అనే కోణంలో ప్రస్తుతం అటు ప్రభుత్వం..ఇటు ఆర్టీసీ జేఏసీ హైకోర్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో జేఏసీ నేతలు తమ ఆందోళన కొనసాగించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి.. మంగళవారం నిరాహార దీక్షలకు జేఏసీ నిర్ణయించింది.