ఖైరతాబాద్ పెద్ద గణేశుడి లైవ్ చూతము రారండి.. త్రీ సిక్ట్సీ డిగ్రీస్లో అద్భుత దృశ్యాలు..!
హైదరాబాద్ : ఖైరతాబాద్ పెద్ద గణేశుడు కొలువుదీరడానికి సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకలకు ముస్తాబయ్యాడు. గణేశ్ నవరాత్రులను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. అయితే 62 కెమెరాలతో త్రీ సిక్ట్సీ డిగ్రీస్లో మహా గణపతిని మహాద్భుతంగా చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైవ్ స్ట్రీమింగ్తో పాటు 24 గంటల పాటు పెద్ద స్క్రీన్ల మీద భారీ గణేశుడిని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఖైరతాబాద్ పెద్ద గణేశుడు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవుగా
వినాయక చవితి వస్తోందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ వైపే. ఈసారి ఎన్ని అడుగుల గణేశున్ని పెడుతున్నారు.. ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి.. నగరంలో ఏ నలుగురూ కలిసినా దాదాపు ఇదే చర్చ కనిపిస్తుంటుంది. గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆ క్రమంలో అక్కడి గణేశ్ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తుంటుంది.
శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా ఈసారి దర్శనమివ్వనున్నారు ఖైరతాబాద్ గణేశుడు. 61 అడుగుల ఎత్తులో విగ్రహం రూపొందించారు. 65 ఏళ్ల మహా గణపతి చరిత్రలో ఈసారి భక్తులను మరింత ఆకట్టుకోనున్నాడు. 12 ముఖాలు, 24 చేతులు.. చూడగానే చాలా విభిన్నంగా కనిపించేలా తీర్చిదిద్దారు. గణేశ్ నవరాత్రులను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి కమిటీ శాయశక్తులా శ్రమిస్తోంది. అదే క్రమంలో అటు పోలీస్ శాఖ కూడా తన వంతు సహాయ సహాకారాలు అందిస్తోంది.
అద్దె గర్భం పేరిట మహిళలకు వల.. నల్గొండ జిల్లాలో దుమారం..!
లైవ్ స్ట్రీమింగ్.. 360 డిగ్రీల కోణంలో విజువల్స్
ఈసారి ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని మరింత అందంగా చూపించేందుకు కమిటీ సభ్యులు సన్నద్ధమయ్యారు. మహా గణపతిని నగర ప్రజలు చూసేందుకు వీలుగా 62 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఏజీస్ సంస్థ సహకారంతో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. క్వాలిటీ ఫైబర్ కేబుళ్లు వాడి ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు.
62 కెమెరాలతో 360 డిగ్రీల కోణంలో మహా గణపతిని మహాద్భుతంగా చూపించనున్నారు. దానికోసం అత్యాధునిక పీటీజెడ్ కెమెరాలు నాలుగు వాడుతున్నారు. ఇక 2 మెగా పిక్సెల్ కెపాసిటీ ఉన్న సీసీ కెమెరాలు 58 ఆరెంజ్ చేశారు. వీటితో వంద మీటర్ల వరకు దృశ్యాలు ఫుల్ క్వాలిటీతో చూడొచ్చు. ఈ కెమెరాలను మహా గణపతి మండపంతో పాటు ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, సెన్సెషన్ థియేటర్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు.
24 గంటల పాటు నిరంతరాయంగా.. రెండు కంట్రోల్ రూమ్లు
ప్రధానంగా ఇన్నీ కెమెరాలను వాడేందుకు ముఖ్య కారణం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే. 62 సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు విజువల్స్ వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ ప్రభుత్వ దవాఖానా పై అంతస్తులో మెయిన్ కంట్రల్ రూమ్ ఏర్పాటు చేయగా.. గణేశ్ మండపం దగ్గర మరో కంట్రోల్ రూమ్ సిద్ధం చేశారు. ఒకవేళ కరెంట్ ప్రాబ్లమ్ వస్తే అధిగమించడానికి ఆరు గంటల వరకు పవర్ అందించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. టెక్నికల్ సమస్యలు తలెత్తినా.. ఆటోమెటిక్గా ఆ కెమెరాలు నిరంతరాయంగా విజువల్స్ చిత్రీకరిస్తూనే ఉంటాయి.
టీనేజ్ అమ్మాయిలే టార్గెట్.. ఈజీగా ట్రాప్ అండ్ మర్డర్.. సోషల్ మీడియా గోలేంటి.. తప్పెవరిది?
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు లైవ్ చూడొచ్చుగా..!
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఖైరతాబాద్ మహా గణపతి మండపం.. ఆధ్యాత్మిక తరంగం వీక్షించడానికి కమిటీ ఏర్పాట్లు చేసింది. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా www.ganapathideva.org వెబ్సైట్లో ప్రపంచం నలుమూలల నుంచి ఎవరైనా, ఎప్పుడైనా చూసే వీలు కల్పించారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా సీసీ కెమెరాలను ఉచితంగా సప్లై చేస్తున్న ఏజీస్ సంస్థ ఈసారి కూడా ఫ్రీగా కెమెరాలు అందిస్తూ తన వంతు సాయం అందిస్తుండటం విశేషం.