ఖైరతాబాద్ గణేశ్... ఉత్సవ కమిటీ కీలక అప్డేట్... ఈసారి ఎన్ని అడుగులంటే..
తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో జనం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా భక్తులకు దర్శన భాగ్యం లేకుండా పోయింది. ఈసారి విగ్రహ ఎత్తును కూడా తగ్గించనున్నారు.
బుధవారం ఉదయం 11గంటలకు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ తయారీ పనులను ప్రారంభించారు. వైరస్ ప్రభావం లేకపోయి ఉంటే ఈసారి 66 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేవారు. కానీ కరోనాను దృష్టిలో ఉంచుకుని విగ్రహాన్ని 9 అడుగల ఎత్తుకే కుదించారు. 66వ ఏట రూపొందిస్తున్న ఖైరతాబాద్ గణేశుడికి ఈసారి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా నామకరణం చేశారు. విగ్రహానికి ఒకవైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవిలను ఏర్పాటు చేయనున్నారు.
Recommended Video
పర్యావరణహితంగా,మట్టితో రూపొందుతున్న ఈ గణపతిని అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో ఈసారి భక్తులు ఎవరూ దర్శనానికి రావద్దని... ఆన్లైన్ దర్శనం చేసుకోవాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. 11 రోజుల పాటు కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.