27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు, ధన్వంతరి రూపంలో దర్శనం, అమృతం..
దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో క్రేజ్. అత్యధిక ఎత్తుతో.. శోభయమానంగా గణేశుడు కొలువుదీరతాడు. గవర్నర్ తొలిపూజతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక పూజల తర్వాత.. నిమజ్జనం కూడా అట్టహాసంగా జరుగుతుంటుంది. అయితే కరోనా వైరస్ వల్ల ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు తగ్గింది. తొలుత ఒక అడుగు వినాయకుడు పెడదామని అనుకున్నారు. కానీ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 27 అడుగుల ఎత్తు వరకు విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎత్తు విషయాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
ఈ సారి వినాయకుడు ధన్వంతరి రూపంలో భక్తులు దర్శించబోతున్నారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణనాథుడు కనిపిస్తారు. ఈ సారి కూడా శిల్పి రాజేందర్ వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తారని కమిటీ పేర్కొన్నది. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తొందరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కొరతామని.. ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.
వినాయకుడు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన మట్టిని గుజరాత్ నుంచి తెప్పిస్తామన్నారు. వినాయకుడు ఎత్తు తక్కువగా ఉండటంతో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోమని.. ఉన్న చోట ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జనం చేస్తామని తెలిపారు. కరోనా వైరస్ వల్ల భక్తులను అనుమతించబోమని కమిటీ స్పష్టంచేసింది. కానీ ఆన్ లైన్ దర్శనం మాత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది.