గంగమ్మ ఒడికి చల్లంగా మహా గణపతి.. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి నిమజ్జనం ప్రశాంతం
Recommended Video
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చల్లంగా చేరుకున్నాడు. పెద్ద గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా జరగడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ప్రక్రియ సాఫీగా సాగింది. పెద్ద గణేశ్ నిమజ్జనం చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వచ్చారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
ఖైరతాబాద్ గణేశ్ వైపే అందరి చూపు
తెలంగాణలో వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ గణేశుడి వైపే ఉంటుంది. ఈసారి ఎన్ని ఫీట్ల ఎత్తులో గణనాధుడు కొలువుదీరబోతున్నాడు అనేది చర్చానీయాంశంగా మారుతుంది. చవితి ప్రారంభానికి నాలుగైదు నెలల ముందు నుంచే మహా గణపతిని రూపొందించే పనిలో పడతారు నిర్వాహకులు. నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి చివరి ఘట్టం కూడా ప్రశాంతంగా ముగిసింది. దాంతో అటు అధికారులు, నిర్వాహకులు, భక్తజనులు ఊపిరి పీల్చుకున్నారు.
1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా
గంగమ్మ ఒడికి చల్లంగా చేరిన పెద్ద గణేశుడు
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరిన పెద్ద గణేశుడు గంగమ్మ ఒడికి చల్లగా చేరుకున్నాడు. ఈ నిమజ్జనోత్సవాన్ని కనులారా తిలకించేందుకు భక్త జనులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా సాగింది. దాదాపు 5 గంటల పాటు సాగిన శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సంపూర్ణ నిమజ్జనం.. అంతా ప్రశాంతం.. క్రేన్ నెంబర్ 6 దగ్గర
శోభాయాత్రతో ఎన్టీఆర్ మార్గ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖైరతాబాద్ వినాయకుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరుకున్నాడు. 61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న భారీ గణనాధున్ని నిమజ్జనం చేయడానికి జర్మనీ టెక్నాలజీతో తయారైన క్రేన్ ను ఉపయోగించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అర్చకులు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం క్రేన్ నెంబర్ 6 దగ్గర మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఇదివరకు క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేసినప్పటికీ.. ఈసారి క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్ల లోతు ఎక్కువగా ఉండటంతో అక్కడే నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి మహా గణపతిని సంపూర్ణ నిమజ్జనం (నిండా నీట మునగడం) చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు కృషి చేశాయి.
మహా గణపతి శోభాయాత్ర ట్రాలీ స్పెషల్ ఇదే
ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని ట్రాలీ పైకి ఎక్కించడం మొదలు నిమజ్జనం వరకు జరిగే ప్రక్రియ మామూలుగా ఉండదు. అంతా సాంకేతిక నిపుణుల సాయంతో పర్యవేక్షణ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఈ భారీ గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద ట్రాలీని వాడుతున్నారు. 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ ట్రాలీకి 28 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును ఇది సునాయాసంగా మోసుకెళుతుంది. ఎన్ని కిలోమీటర్లైనా ఇబ్బందులు లేకుండా దీని జర్నీ సాగుతుంది. STC ట్రాన్స్పోర్టు సంస్థ గత ఎనిమిదేళ్లుగా ఖైరతాబాద్ పెద్ద గణేశుడి విగ్రహ తరలింపులో ఈ ట్రాలీని ఫ్రీ గా అందిస్తోంది.
బై బై గణేశా.. గంగమ్మ ఒడికి గణనాధులు.. నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
క్రేన్ ప్రత్యేకతలు మరెన్నో.. 400 టన్నుల సామర్థ్యం
ఇక నిమజ్జన ఘట్టంలో క్రేన్ పాత్ర కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ను ఉపయోగించారు. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ క్రేన్లో హైడ్రాలిక్, రిమోట్ కంట్రోలింగ్ సిస్టం ఉంది. 14 మీటర్ల పొడువు, 4 మీటర్ల వెడల్పు ఉండే ఈ క్రేన్కు 12 టైర్లు ఉంటాయి.
ఒక్కో టైరు బరువు టన్ను ఉంటుందని సమాచారం. 400 టన్నుల బరువును అవలీలగా ఎత్తుతుంది. 45 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేయడంలో ఈ క్రేన్ ఎంతగానో ఉపయోగపడింది. మోడ్రన్ క్రేన్ సంస్థ దీన్ని ఉచితంగా అందిస్తుండటం విశేషం.