ఖైరతాబాద్ పెద్ద గణేశుడిదే తొలి నిమజ్జనం.. మద్యం దుకాణాలు బంద్ ఎప్పుడంటే..!
Recommended Video
హైదరాబాద్ : వినాయక నవ రాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా భక్తుల పూజలందుకున్న విఘ్నేశుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది. అలా ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ లాంటి ప్రసిద్ధ గణేశ్ విగ్రహాలు మాత్రం చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు.
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్లో 12వ తేదీ గురువారం గణేశుల నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఖైరతాబాద్ మహా గణపతిని తొలి నిమజ్జనం చేయనున్నారు.
ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసేంత వరకు ఇతర విగ్రహాల నిమజ్జనాలను ఎక్కడికక్కడ ఆపి వేయనున్నారు. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమయ్యే మహా గణపతి శోభా యాత్ర ట్యాంక్ బండ్ చేరుకునే సరికి ఉదయం 11 గంటలు దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకు 11 గంటల 30 నిమిషాలకు ఖైరతాబాద్ గణేశుడ్ని నిమజ్జనం చేయనున్నారు.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి పోలీస్ శాఖ సూచనలు
45 టన్నులకు పైగా బరువున్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం అంతా ఈజీ కాదు. 61 x 27 సైజులో భారీగా ఉన్న ఈ గణేశుడ్ని గంగమ్మ ఒడికి చేర్చడానికి చాలా కష్టపడతారు నిర్వాహకులు. శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. గురువారం నాడు నిమజ్జనం జరగనుండగా ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
క్రేన్ నెంబర్ 4.. లేదంటే క్రేన్ నెంబర్ 6 దగ్గర నిమజ్జనం
ఖైరతాబాద్ మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో పాటు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రోన్ కెమెరాల సాయంతో హుస్సేన్ సాగర్లో నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల డేటా తెప్పించారు. అదలావుంటే క్రేన్ నెంబర్ 4 దగ్గర.. అలాగే క్రేన్ నెంబర్ 6 దగ్గర హుస్సేన్ సాగర్లో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తను తొలగించేలా అటు హెచ్ఎండీఎ, ఇటు జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే ఈ రెండు క్రేన్ల దగ్గర ఏదో క్రేన్ దగ్గర ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మద్యం దుకాణాలు ఆ సమయంలో బంద్..!
వినాయక నిమజ్జనం సందర్భంగా 12వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి మరునాడు సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఆ మేరకు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా మందు బాబులకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు సీపీ.