ఖైరతాబాద్ పెద్ద గణేశ్ శోభాయాత్ర.. మహా గణపతి నిమజ్జనంలో ఎన్నో ప్రత్యేకతలు..!
Recommended Video
హైదరాబాద్ : ఖైరతాబాద్ పెద్ద గణేశుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. పదకొండు రోజుల పాటు మహా పూజలు అందుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి నిమజ్జన పర్వం పూర్తి కానుంది. హుస్సేన్ సాగర్లో పెద్ద గణేశుడిని నిమజ్జనం చేసే క్రమంలో ఉదయమే శోభాయాత్ర ప్రారంభమైంది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర మహా గణపతి నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈసారి సంపూర్ణ నిమజ్జనం చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆ మేరకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్ల అడుగుల లోతులో పూడిక తీపించారు. లంబోదరుడి మహా నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
ఖైరతాబాద్ పెద్ద గణేశుడిదే తొలి నిమజ్జనం
వినాయక నవ రాత్రుల చివరి ఘట్టం పూర్తి కానుంది. పదకొండు రోజుల పాటు ఘనంగా భక్తుల పూజలందుకున్న విఘ్నేశుడు గంగమ్మ తల్లి ఒడికి చేరుతున్నాడు. హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది. అలా ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ లాంటి ప్రసిద్ధ గణేశ్ విగ్రహాలు మాత్రం చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు.
61 X 27 సైజుతో 45 టన్నుల బరువు
45 టన్నులకు పైగా బరువున్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం అంతా ఈజీ కాదు. 61 x 27 సైజులో భారీగా ఉన్న ఈ గణేశుడ్ని గంగమ్మ ఒడికి చేర్చడానికి చాలా కష్టపడతారు నిర్వాహకులు. శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
కొనసాగుతున్న శోభాయాత్ర
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. మండపం నుంచి బయలుదేరిన పెద్ద గణేశుడు హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళుతున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన పర్వం ముగియనుంది. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి రాకతో ఎన్టీఆర్ మార్గ్ లోని విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నారు. మహాగణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై క్రేన్ సిద్దం చేశారు. క్రేన్ నెంబర్ 6 దగ్గర ఖైరతాబాద్ లంబోదరుడి నిమజ్జన ప్రక్రియ ముగియనుంది.
మధ్యాహ్నం ఒంటి గంట లోపే నిమజ్జనం
ఖైరతాబాద్ గణేశ్ మండపం నుంచి మహా గణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా సాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య క్రేన్ నెంబర్ 6 దగ్గరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం గంగా హారతి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఒంటి గంట లోపు క్రేన్ సాయంతో పెద్ద గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. ఈసారి విగ్రహం పూర్తిగా నీట మునిగేలా సంపూర్ణ నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్ల అడుగుల లోతులో పూడిక తీయించారు.
ట్రాలీ స్పెషల్ ఇదే
ఖైరతాబాద్ మహా గణపతిని శోభాయాత్రగా తీసుకెళ్లేందుకు భారీ ట్రాలీని వినియోగిస్తున్నారు. 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ ట్రాలీకి 28 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును ఇది సునాయాసంగా మోసుకెళుతుంది. ఎన్ని కిలోమీటర్లైనా ఇబ్బందులు లేకుండా దీని జర్నీ సాగుతుంది. STC ట్రాన్స్పోర్టు సంస్థ గత ఎనిమిదేళ్లుగా ఖైరతాబాద్ పెద్ద గణేశుడి విగ్రహ తరలింపులో ఈ ట్రాలీని ఫ్రీ గా అందిస్తోంది.
క్రేన్ స్పెషాలిటీ తెలుసా
ఇక ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంలో వినియోగించే క్రేన్కు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ క్రేన్లో హైడ్రాలిక్, రిమోట్ కంట్రోలింగ్ సిస్టం ఉంది. 14 మీటర్ల పొడువు, 4 మీటర్ల వెడల్పు ఉండే ఈ క్రేన్కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు బరువు టన్ను ఉంటుందని సమాచారం. 400 టన్నుల బరువును అవలీలగా ఎత్తుతుంది. 45 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేయడంలో ఈ క్రేన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మోడ్రన్ క్రేన్ సంస్థ దీన్ని ఉచితంగా అందిస్తుండటం విశేషం.