కరోనా ఎఫెక్ట్: ఒక్క అడుగుకే పరిమితం కానున్న ఖైరతాబాద్ వినాయకుడు...? వైరస్ తగ్గితే..?
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ వినాయకుడికి కూడా తగలింది. ఎత్తైనా విగ్రహాంగా పేరున్న.. ఖైరతాబాద్ విగ్రహాన్ని ఈ ఏడాది ఒక అడుగుతో ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తెలిపింది. భారీ విగ్రహాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఆగస్ట్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించి... అడుగు ఎత్తులో విగ్రహాం ఏర్పాటు చేస్తామని తెలిపింది.
వైరస్ ప్రభావం లేకుంటే 66 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ భావించింది. కానీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడంతో.. అంత ఎత్తులో విగ్రహాం పెట్టొద్దనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 18వ తేదీన కర్రపూజ కూడా చేయాలని భావించారు. కానీ దానిని కూడా నిర్వహించడం లేదని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగిరి సుదర్శన్ తెలిపారు.
ఆగస్ట్ నాటికి కరోనా వైరస్కు వ్యాక్సిన్ వస్తే తాము తొలుత అనుకొన్న 66 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. లేదంటే అడుగు విగ్రహాంతోనే వినాయకుడిని కొలుస్తామని వివరించారు. ఎత్తైన వినాయకుడిగా ఖైరతాబాద్ గణేశుడికి పేరు ఉంది. ఇక్కడ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం ఆ ప్రభ కనిపించే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది.