ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభం : ప్రత్యేక పూజలు- భక్తుల కోలాహలం : మధ్నాహ్నం నిమజ్జనం..!!
హైదరాబాద్ లో గణేషుని నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనంలో ప్రత్యేక స్థానం ఉన్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.
40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర ఖైరాతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్పైకి సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. ట్యాంక్ బండ్పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడిని సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్బండ్పైకి శోభాయాత్ర సాగనుంది.
మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ట్యాంక్ బండ్పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ సిబ్బంది భక్తులకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గణనాథుని నిమజ్జనం ముగినుంది. గత ఏడాది వరకు ఖైరతాబాద్ వినాయకుడు చివరగా మరుసటి రోజు మధ్నాహ్నం నిమజ్జనం జరిగేది.
కానీ , పోలీసులు ముందుగానే ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం చేయటం ద్వారా మిగిలిన నిమజ్జనం పైన అన్ని శాఖల పైన ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో..నిర్వాహకులు సైతం పోలీసుల సూచనలకు అనుగుణంగా సహకరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగి.. మధ్నాహ్నం సాగర తీరంలో నిమజ్జనం జరగనుంది. ఇదే సమయంలో బాలాపూర్ లడ్డు వేలం కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడే బాలాపూర్ లో లడ్డూ వేలం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఇప్పుడు బాలాపూర్ బంగారు లడ్డు కు ఎంత ధర పలుకుతుందనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆసక్తి కలిగించే అంశంగా మారుతోంది.