వెరైటీ : దొంగ కిడ్నాప్.. వాడు దోచింది వీళ్లు కాజేశారు..!
హైదరాబాద్ : సమాజంలో కొందరి తీరు వింతగా ఉంటుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ.. కష్టపడి పనిచేయడం కష్టమనుకుంటారు. ఏ పుట్టలో ఏముందో అన్నట్లు.. ఎక్కడ డబ్బు కనిపిస్తుందో అక్కడ కన్నేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ముఠా.. దొంగనే కిడ్నాప్ చేసి డబ్బులు లాగింది. పని చేతగాక దారి తప్పి, వాడు చోరీలను వృత్తిగా మలుచుకుంటే.. ఆ దొంగోడి దగ్గరే సొమ్ము కాజేసిన ఘటన చర్చానీయాంశంగా మారింది.
తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?
దొంగ కష్టపడ్డాడు.. వీళ్లు ఈజీగా కొట్టేశారు
దొంగతనాలనే వృత్తిగా ఎంచుకుని చోరీలు చేస్తున్న ఓ దొంగను టార్గెట్ చేశారు కొందరు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో నివసించే జేబుదొంగ వెంకటయ్యపై కన్నేశారు. అతడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని గ్రహించి.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడ్డారు. వెంకటయ్యను ట్రాప్ చేసి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటయ్యపై దాదాపు 40కి పైగా జేబు దొంగతనాల కేసులు నమోదయ్యాయి. దొంగతనాలతో వెంకటయ్య బాగా కూడబెట్టాడని, అతడిని బెదిరించి దోచుకోవాలనేది ఈ ముఠా ప్లాన్.
పిట్ల శంకర్(52), అబ్దుల్ హమీద్(37), గైక్వాడ్ రాజారాం(37), షేక్ అన్వర్(34), కొల్లి సాయికృష్ణ(32), పిట్ల రవి(26), గుర్రం కల్యాణ్(23), పంజల సాయికృష్ణ(23) ముఠాగా ఏర్పడ్డారు. జేబుదొంగ వెంకటయ్యను ఈ నెల 2వ తేదీన కిడ్నాప్ చేశారు.
దొంగను కిడ్నాప్ చేశారు
జేబుదొంగ వెంకటయ్య నుంచి భారీగా డబ్బులు గుంజాలని ప్లాన్ వేసిన ఈ ముఠా సభ్యులు.. ఈ నెల 2వ తేదీన రెండు కార్లలో వచ్చి అతడిని కిడ్నాప్ చేశారు. మొదట యాదగిరిగుట్టకు తీసుకెళ్లి ఓ లాడ్జిలో బంధించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాలని చిత్రహింసలు పెట్టారు. శరీరంపై సిగరెట్ తో కాల్చారు. అక్కడినుంచి రెండు మూడు ప్రాంతాలకు మార్చి చివరగా భువనగిరిలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అదే ప్రాంతంలో నివసించే అతడి బావమరిది నాగయ్యను పిలిపించారు. వెంకటయ్యతో పాటు నాగయ్యను తీవ్రంగా హింసించారు.
దొంగోడిపై కన్ను.. సొమ్ము వసూలు
కిడ్నాపర్ల చిత్రహింసలు తాళలేక వారిద్దరు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాంతో 18 లక్షల రూపాయల నగదుతో పాటు ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు కిడ్నాపర్లకు సమర్పించారు. ఆ క్రమంలో ఈ నెల 5వ తేదీన వెంకటయ్య, నాగయ్యను వదిలేశారు. అయితే ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న వెంకటయ్య తీవ్రగాయాలతో ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్ ముఠా తన పట్ల వ్యవహరించిన తీరును వివరించి ఫిర్యాదు చేశాడు.
దొంగ ఫిర్యాదు.. కిడ్నాపర్లు అరెస్ట్
బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 రోజుల వ్యవధిలో కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 18 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.