డాడీ! మమ్మీ ఎప్పుడొస్తుంది:తలుపు దగ్గరే తల్లి కోసం చిన్నారులు,కంటతడి పెట్టిస్తున్న మహిళా టెక్కీ మృతి
మంగళవారం రోజున బంజారాహిల్స్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు మహిళా టెక్కీని ఢీకొనడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పలువురిని కలచివేసింది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో పనిచేస్తున్న సోహినీ సక్సేనా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఆఫీసుకు బయలుదేరింది. బంజారా హిల్స్కు చేరుకోగానే ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ ఆమె వెళుతున్న బైకును ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సోహినీ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. సోహినీకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లి వస్తుందన్న ఆశతో ఇద్దరు చిన్నారులు నిన్నటి నుంచి ఆశగా తలుపు దగ్గర ఎదురు చూస్తుండటం పలువురిని కలచివేసింది.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లేడీ టెక్కీ మృతి: శవంతో సెల్ఫీలు దిగిన యువకుడు, నెటిజన్ల ఫైర్
డాడీ..మమ్మీ ఎప్పుడొస్తుంది..?
ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడపడంతో మరో ప్రాణం నేలకొరిగింది. టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న సోహినీ సక్సేనాను బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆ కుటంబంలో తీవ్ర విషాదంను నింపింది. అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న అంటూ ఆ చిన్నారులు సోహినీ భర్త దిలీత్ కుమార్ను అడుగుతుంటే సమాధానం చెప్పలేక కన్నీరు మున్నీరయ్యారు. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో సోహినీ మృతి కోలుకోలేని విషాదాన్ని నింపింది.
రోడ్డు ప్రమాదం గురించి చెప్పని పోలీసులు
సాధారణంగా సోహినీ ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుందని అయితే ప్రమాదం జరిగిన రోజున మాత్రం ఆమె ఆఫీసుకు కాస్త ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు భర్త దిలీత్ సింగ్. ఐసీసీఐ బ్యాంకులో దిలీత్ సింగ్ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తన బాస్తో ఓ మీటింగ్లో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. సోహినీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని బంజారాహిల్స్లోని విరించి హాస్పిటల్కు రావాలని తన మిత్రుడు ఫోన్ చేసి చెప్పినట్లు దిలీత్ సింగ్ తెలిపారు. వెంటనే బయలుదేరి వెళ్లినట్లు చెప్పిన దిలీత్ సింగ్ ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనాలు గుమికూడి ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత తన భార్య మృతదేహంను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిసి అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఘటన గురించి పోలీసులు తనకు ఫోన్ చేసి చెప్పకపోవడం నిజంగా తనకు షాక్కు గురిచేసిందని దిలీత్ సింగ్ చెప్పారు.
తల్లికోసం తలుపు దగ్గర చిన్నారుల ఎదురుచూపులు
తమకు అక్షయ్ అంకిత అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్లు చెప్పిన దిలీత్ సింగ్ తన జీవితం ఇప్పుడు ఏమవుతుందో అనే ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు మమ్మీ గురించి అడిగినప్పుడల్లా తనకు ఎంతో బాధ వేస్తోందని కన్నీరుమున్నీరయ్యారు దిలీత్ సింగ్. తన భార్యే తనకు సర్వస్వం అని చెప్పారు. ప్రభుత్వం తన పిల్లల చదువకు సహాయం చేయాలని ఆయన కోరారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వాన్ని కోరారు. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తనకు తెలిసిందని దిలీత్ సింగ్ చెప్పారు.
ప్రభుత్వం డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తమది మధ్య తరగతి కుటుంబమని చెప్పిన దిలీత్ సింగ్.. ఇద్దరం తమకొచ్చే జీతాలపైనే కుటుంబ పోషణను నడిపేవారమని ఇప్పుడొక చేయి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోహినీతో చివరిసారిగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముందు మాట్లాడినట్లు చెప్పారు. ఆఫీసుకు ఆలస్యంగా వెళుతున్నట్లు చెప్పిన సోహినీ.. డ్యూటీ తర్వాత తన అన్న బర్త్డే ఉన్నందున అక్కడికి వెళతానని చెప్పినట్లు దిలీత్ సింగ్ చెప్పారు. కానీ ఆమె ఒకటి తలచగా విధి మరొకటి తలచిందంటూ కన్నీరుమున్నీరయ్యాడు దిలీత్ సింగ్.