ఇంట్లో ఈగల మోత..: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిల మోత అన్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ లాంటి వ్యక్తి దేశాన్ని ఉద్దరిస్తారా?: కిషన్ రెడ్డి
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారు తప్ప.. తెలంగాణలో ఉండే ప్రతిపక్షాలను కేసీఆర్ కలవరని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వ్యవహారమంతా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఉద్దరిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. వివిధ శాఖలకు చెందిన చెల్లింపులు సకాలంలో జరపడం లేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించట్లేదన్నారు. రాష్ట్రంలో చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
దేశంలో అబద్ధమాడే కుటుంబం అంటే అది కేసీఆర్దే: కిషన్
దేశంలో అబద్దమాడే కుటుంబం ఏదైనా ఉందంటే కల్వకుంట్ల కుటుంబం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాలను తప్పించుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ నిధులను సకాలంలో విడుదల చేయకుండా సర్పంచ్లను బెదిరిస్తున్నారు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేతల కబ్జాలు, బెదిరింపులంటూ కిషన్ ఫైర్
ప్రభుత్వ వసతిగృహాల్లో కనీస వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు రూ.3016 ఇస్తానని చెప్పి మూడేళ్లు అయిపోయినా.. ఇంకా ఇవ్వడం లేదని కిషన్రెడ్డి మండిపడ్డారు. అంతేగాక, రైతుల రుణమాఫీని ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. హుజూరాబాద్లో ఉప ఎన్నికలప్పుడు దళిత బంధు అని మభ్యపెట్టారని, మునుగోడులో ఉపఎన్నిక వస్తే గిరిజన బంధు అంటున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిలో అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.