ఆ టైంలో కొదమసింహంలా రేవంత్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాతే కేసీఆర్ను వ్యతిరేకించా: కోదండరాం
మహబూబ్నగర్/హైదరాబాద్: తెలంగాణ కోసం కొడంగల్ ప్రజలు కొదమసింహంలా పోరాడారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మన పొలాలను కృష్ణా జలాలు తడుపుతాయని ఆశపడ్డామని అన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదన్నారు. బతుకులు మార్చడానికి ప్రాజెక్టుల డిజైన్లు మార్చలేదన్నారు. వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఉచితమని చెప్పారు.
లాఠీ దెబ్బలకు భయపడకుండా పోరాటం
లాఠీ దెబ్బలకు భయపడకుండా తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడారని కొడంగల్ ప్రజలపై కోదండరాం ప్రశంసలు కురిపించారు. నీటి వసతి లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గుత్తేదారుల జేబులు నింపడానికే ప్రాజెక్టుల అంచనాలు పెంచేశారని ఆరోపించారు. కొడంగల్కు న్యాయం జరగాలంటే ప్రజాకూటమి అధికారంలోకి రావాలన్నారు. పన్నులు తగ్గిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
సరైన నాయకత్వం లేనిసమయంలో యువకుడిగా వచ్చిన రేవంత్
మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ జిల్లాలో ఏ పార్టీకి సరైన నాయకత్వం లేని సమయంలో ఓ యువకుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో రాణించి, ఇక్కడి ప్రజల సమస్యలను తీరుస్తూ ఓ కొదమసింహంలా ప్రభుత్వాలతో పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కోదండరామ్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన నేతల్లో రేవంత్ కూడా ఉన్నారన్నారు.
ఆ ఆలోచన కూడా రాలేదు
కృష్ణా నదీ జలాలను ఇక్కడికి తెస్తానని తెరాస ఇచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పారు. ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్కా కృష్ణానదిలోకే వెళుతుందని గుర్తు చేశారు. చాలా సులభంగా ఆ నీటిని ఈ ప్రాంతానికి తరలించవచ్చనని అన్నారు. కానీ ఆ ఆలోచన పాలకులకు రాలేదని విమర్శించారు. ఇక్కడి పొలాలు బీడు భూములుగా కనిపిస్తున్నాయని, వస్తాయనుకున్న నీరు రావడం లేదని, ముక్కెక్కడుందంటే, చుట్టూ తిప్పి చూపించినట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు.
నీ మాటలు నమ్మేందుకు చెవుల్లో పూవులు లేవు
ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జూరాలను వదిలి శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడం ఏమిటని కోదండరాం ప్రశ్నించారు. ఆయన మాటలను నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకుని లేమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదల ఉన్నవారని, ఇక్కడికి నీరు తెప్పించేవరకు వారు విశ్రమించరన్నారు. కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాతే కేసీఆర్ను వ్యతిరేకించామన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలన్నారు.