అనుమానస్పద మృతిగా కోడెల కేసు.. పోస్టుమార్టం వచ్చాక క్లారిటీ : హైదరాబాద్ సీపీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో కోడెల మరణంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మృతిపై పోలీస్ శాఖ ఏం చేయబోతుందనే దానిపై వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం తర్వాత ఆయన మృతిపై స్పష్టత వస్తుందని తెలిపారు.
కోడెల మృతిపై దర్యాప్తు చేయడానికి మూడు బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు సీపీ అంజనీ కుమార్. అయితే అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్లూస్, టెక్నికల్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయన్న సీపీ.. సాక్ష్యాలు నాశనం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
కోడెల మృతిపై నేతలు ఏమన్నారంటే..!
అదలావుంటే కోడెల శివప్రసాద్ రావు మరణంపై డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. ఆత్మహత్యనా లేదంటే హత్యనా అనేది పోస్టుమార్టం తర్వాత నిర్ధారిస్తామని తెలిపారు. కోడెల తన బెడ్రూమ్లో ఉరి వేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఆయన భార్య, కుమార్తెతో పాటు పనిమనిషి ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు తమకు తెలిపినట్లు వివరించారు.
హాస్పిటల్కు తీసుకొచ్చేసరికి ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారనేది కుటుంబ సభ్యుల వెర్షన్ అని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి ఇంటిలో ఎలాంటి గొడవ కూడా జరగలేదని వారు తమకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోందని.. ఆ రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు డీసీపీ.