పార్టీ మారబోనంటూనే .. బీజేపీ తోపు, కాంగ్రెస్ వేస్ట్, కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద వలసల పర్వం కొనసాగుతుంది. అయితే అధికార టీఆర్ఎస్ ఓవర్ ఫ్లో అవడంతో మిగిలిన నేతలు కమలం వైపు చూస్తున్నారు. తాజాగా బీజేపీలో చేరబోతున్నానని సంకేతాలిచ్చారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్థానిక నాయకత్వం లోపం వల్లే పార్టీకి గడ్డు పరిస్థితి దిగజారిపోయిందన్నారు కోమటిరెడ్డి. లోకల్ లీడర్ వల్లే పార్టీ దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు హ్యాండ్ ?
కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హ్యాండివ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం వలసలతో కోమటిరెడ్డి విసిగిపోయారు. అంతేకాదు ఇటీవల వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు రాజగోపాల్. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ను తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిని వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. కానీ రాజగోపాల్ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైపోయనట్టైంది.
అంతా మీరే చేశారు ?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తేలిపోయిందని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి. అయితే స్థానిక నాయకత్వం లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుందని .. దీంతో నేతలంతా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందని స్పష్టంచేశారు. స్థానిక నాయకత్వం చేస్తున్న చర్యలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే తాను పార్టీ మారబోతున్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఎమ్మెల్యేల జంప్ ?
కాంగ్రెస్ హైకమాండ్, స్థానిక నాయకత్వం లోపం వల్లే పార్టీ క్రమంగా దెబ్బతిందని కోమటరెడ్డి చెప్పారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు కారణం ఎవరు అని ప్రశ్నించారు. ఒక్కో నేత పార్టీ వీడి వెళ్తున్న మిన్నకుండి చూశారని మండిపడ్డారు. దీంతో పార్టీ క్రమంగా ప్రతిపక్ష హోదా నుంచి దిగజారిపోయిందని విమర్శించారు. తాను ఇప్పడే పార్టీ మారడం లేదంటూనే .. మోడీపై పొగడ్తలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మరింత బలపడుతుందని అంచనా వేశారు. అంటే తాను పార్టీ వీడుతాననే పరోక్షంగా సంకేతాలిచ్చారు.