కేసీఆర్ పాపం పండింది.. అందుకే అలా జరిగింది.. కోమటిరెడ్డి సెటైర్లు..!
నల్గొండ : కేసీఆర్ పాపం పండింది.. అందుకే బిడ్డ ఓడిపోయిందంటూ సెటైర్లు వేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. హుజుర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రజలను కోరారు.
పద్మావతితో కలిసి నేరెడుచర్ల మండలంలోని పలు గ్రామాల్లో రోడ్షో లో పాల్గొన్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే క్రమంలో సీఎం కేసీఆర్పై మాటల తూటాలు సంధించారు. కోమటిరెడ్డి రాకతో ఆయా గ్రామాల్లో అభిమానులు ఘన స్వాగతం పలకడమే గాకుండా పూల వర్షం కురిపించారు.
రెండో భర్తతో కలిసి.. ఆస్తి కోసం భర్తను, బంధువులను చంపి..! 17 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ
రాష్ట్రంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. ప్రగతి భవన్లో మాత్రం బాత్రూమ్ను కూడా బుల్లెట్ ప్రూఫ్తో కట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరా గాంధీ ఐతే.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న కేసీఆర్ మాత్రం మోసం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచడానికి పైసలు లేవు గానీ.. ఉన్న భవనాలు కూల్చి కొత్త కట్టడాలు నిర్మించడానికి మాత్రం డబ్బులొస్తాయా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ చేసిన పాపాలు పండటంతోనే మొన్నటి పార్లమెంటరీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఆయన కూతురు కవితమ్మ ఓడిపోయారని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరోసారి కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కోరారు. ఇక్కడ పద్మావతిని గెలిపించడం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసమో, నా కోసమో కాదని.. నాలుగు కోట్ల ప్రజల బతుకులు బాగుపడటం కోసమని చెప్పుకొచ్చారు. చిరుమర్తి లింగయ్యను మేము సాదుకుని మూడుసార్లు జడ్పీటీసీగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే.. కేసీఆర్ వచ్చి అతడిని కొనుక్కుపోయాడని ధ్వజమెత్తారు. ఇదా టీఆర్ఎస్ రాజకీయం.. పోరాడి గెలవలేరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.