ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, ఉచితంగానే క్రమబద్ధీకరిస్తాం..?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
సీఎం కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తుగ్లక్ చర్య అని ధ్వజమెత్తారు. ఓపెన్ ప్లాట్లపై ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేశామని.. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతానని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు.
స్థలాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో లక్ష కోట్లు వస్తాయని చెప్పారు. మొత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల కోట్లు తీసుకొని రావాలని అనుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రజలు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించవద్దు అని కోమటరెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఆయన అన్నారు. తప్పుడు లేఅవుట్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ.. ప్రజలపై ఎందుకు రుద్దుతుంది అని అడిగారు. ఎలాంటి జరిమానా లేకుండా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని పిటిషన్ వేశామని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళతామని చెప్పారు.
కేసీఆర్ సర్కార్ చారిత్రాక తప్పదాలు చేస్తుందని మండిపడ్డారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయమని చెప్పారు. ప్రజాతీర్పు కేసీఆర్ సర్కార్కు చెంప పెట్టు కాబోతుందని తెలిపారు.