అంతా విషాదమే.. 6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా ట్వీట్ల యుద్దం..!
హైదరాబాద్ : ఒకనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అధినేతతో సత్సంబంధాలు పెంచుకున్నారు. అలా ఎంపీ కూడా అయ్యారు. అప్పుడు అధినేతకు అనుకూలంగా మాట్లాడారు. అయితే ఏమైందో ఏమో గానీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. తిరిగి గెలవలేకపోయారు. అదలావుంటే టీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇక అడపాదడపా ఆయన టీఆర్ఎస్పై మాటల యుద్దం చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా కడిగి పారేస్తున్నారు. అదే క్రమంలో తాజాగా 6 పాయింట్లతో రాష్ట్రంలో అంతా విషాద గీతమే.. ఏమున్నది గర్వకారణం అంటూ ఆయన చేసిన ట్వీట్ చర్చానీయాంశమైంది.
కారు నుంచి హస్తం గూటికి
తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014 నాటి లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ క్రమంలో పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఆయనపై కొండా 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ముద్రపడ్డ కొండా అలా పార్లమెంటుకు వెళ్లారు. అయితే గత డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయన టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సీఎం కుర్చీ 50-50.. బీజేపీతోనే ప్రభుత్వం.. శివసేన ఫార్ములా.. 29 ఏళ్లకే ముఖ్యమంత్రా?
పట్నంతో కొండా ఢీ.. అందుకేనా అటు నుంచి ఇటు..!
రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో విబేధాలు ఉన్నాయనేది బయట వినిపించే టాక్. అందుకే ఆయన టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అదలావుంటే ఆయన టీఆర్ఎస్ను వీడి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ నేతలపై ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుస్తున్నారు.
6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల యుద్దం
తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా అంతా విషాదమే అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై 6 పాయింట్లతో మాటల తూటాలు సంధించారు. హుజుర్నగర్ ఫలితాలతో విషాదమే తప్ప మిగిలిందేమీ లేదనే తీరుగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపికైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదన్నట్లుగా ఆరు పాయింట్లతో ట్వీట్ చేశారు కొండా. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ తాజాగా హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచిన సందర్భంలో ఆయన చేసిన ట్వీట్ చర్చానీయాంశంగా మారింది.
ఈ విజయం టానిక్.. బాధ్యత పెరిగింది.. హుజుర్నగర్ ప్రజలను కలుస్తా : సీఎం కేసీఆర్
అంతా విషాదమే.. ఇవే ఆ 6 పాయింట్లు
ఆర్టీసీ ఉద్యోగులకు విషాదం.. ప్రతిపక్షాల గొంతులు పెగలకుండా చేసిన విషాదం.. తెలంగాణ విద్యార్థులకు విషాదం.. తెలంగాణకు విషాదం (sad for T).. ప్రజాస్వామ్యానికి విషాదం (లాంగ్ లైవ్ ట్రంప్ అండ్ కేసీఆర్).. కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు విషాదం, కేసీఆర్ కేటీఆర్ ఫార్ములా మరోసారి వర్కవుట్ అయ్యిందంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపికైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హుజుర్నగర్లో కొంతైనా ప్రజా వ్యతిరేకత వస్తుందని ప్రతిపక్ష నేతలు భావించారు. అయినప్పటికీ అదేమీ ప్రభావం చూపించకపోగా.. టీఆర్ఎస్కు మరోసారి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో కొండా చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.