జల జగడం: జగన్పై కేసీఆర్ ఫైర్.. జీవో 203పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు.. ఏపీ ఘాటు స్పందన.. అసలేంటిది?
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203ను వెంటనే నిలుపుదల చేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఏపీ కొత్త లిఫ్ట్ స్కీం చేపట్టడం అన్యాయమని, శ్రీశైలం నుంచి అక్రమంగా 3 టీఎంసీల నీటిని ఏపీకి తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు వివరించింది.
మూడు పేజీల లేఖ..
ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి నీటిని వాడుకునే విషయంలో తెలంగాణకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, కొత్త ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ అపెక్స్ కమిటీ ఆమోదం తప్పనిసరని తెలిసినా కూడా ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ జీవో జారీ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు మూడు పేజీల లేఖ రాశారు. టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపేసేలా ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు రజత్ కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా రివర్ బోర్డు చైర్మన్తో మాట్లాడనున్నారు.
కేసీఆర్ ఫైర్..
గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించిందని, బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవచూపానని, అయినాసరే జగన్ సర్కారు అక్రమ ప్రాజెక్టు నిర్మించనుండటం అత్యంత బాధాకరమని సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షలో వాపోయారు. సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ తలపెట్టిన పనిని కచ్చితంగా అడ్డుకుంటానని, అందుకోసం న్యాయపోరాటం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
జగన్ ఘాటు స్పందన..
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్మించనున్న కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లులేని దుస్థితి నెలకొందని, ఈ విషయంలో ఎవరైనాసరే మానవతా దృక్పథంతో ఆలోచించాలని కేసీఆర్ కు చురక వేశారు. నిజానికి ఇది అక్రమ ప్రాజెక్టు కాదని, ఏపీకి దక్కాల్సిన వాటా నీటిని మాత్రమే వాడుకుంటామని, ఆ వ్యవహారమంతా కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే సాగుతుందని స్పష్టం చేశారు.
10 రోజులు మాత్రమే తోడుకుంటాం..
‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ నుంచి 44 వేల క్యూసెక్కుల తీసుకునే అవకాశం ఉంటుంది. సంత్సరంలో ఆ దశ కేవలం 10 రోజులకు మించి ఉండదు. ఆ గడువులోనే కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు తీసుకెళ్లేందుకే కొత్త లిఫ్టు కడుతున్నాం. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లబోదని అందరికీ తెలిసిందే. అయినా, పరిధి దాటి నీటిని వాడుకుంటే దానిని కృష్ణా బోర్డు కూడా అంగీకరించదు కదా''అని జగన్ వివరణ ఇచ్చారు.
అసలేంటీ వివాదం?
ఏపీ
తెలంగాణ
మధ్య
పోతిరెడ్డిపాడు
వివాదం
ఎప్పటి
నుంచో
కొనసాగుతోంది.
శ్రీశైలం
బ్యాక్
వాటర్
ను
లిఫ్ట్
చేసి
రాయలసీమకు
తరలించడమే
లక్ష్యంగా
పోతిరెడ్డిపాడు
అనే
గ్రామం
వద్ద
హెడ్రెగ్యులేటర్
ను
2005లో
నిర్మించారు.
తమక
దక్కాల్సిన
నీటిని
అక్రమంగా
రాయలసీమకు
తరలిస్తున్నారంటూ
తెలంగాణ
నేతలు
తొలి
నుంచీ
దీనిపై
ఆందోళనలు
చేస్తున్నారు.
వాటిని
పట్టించుకోకుండా,
పోతిరెడ్డిపాడు
సామర్థ్యాన్ని
పెంచేందుకు
గతంలోనూ
చాలా
ప్రయత్నాలు
జరిగాయి.
జగన్ దూకుడుతో..
జగన్ సర్కారు తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించుకుంది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా బోర్డులకు లేఖలు రాయగా.. తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, తమ అనుమతి లేకుండా తుది నిర్ణయం తీసుకోవద్దని బోర్డు.. ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. అయినాసరే, జగన్ సర్కారు 203జోవో ద్వారా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి, టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించడంతో వివాదం మరింత ముదిరింది.