కేటీఆర్ జన్మదినం.. కొడుకు హిమాన్షు అన్నదానం.. మరెన్నో సేవా కార్యక్రమాలు
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కేకులు, పూలబొకేలు, ఫ్లెక్సీలు, యాడ్స్కు ఖర్చు పెట్టకుండా అవసరం ఉన్నవారికి సాయం చేయాలనే "గిఫ్ ఏ స్మైల్ ఛాలెంజ్" కార్యక్రమంతో కేటీఆర్ పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీశ్రేణులతో పాటు కేటీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తండ్రి పుట్టిన రోజు పురస్కరించుకుని కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. బంజారాహిల్స్ ప్రాంతంలోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి హిమాన్షు హాజరయ్యాడు. అక్కడున్నవారితో కలిసిపోయి పలువురికి భోజనాలు వడ్డించి శభాష్ అనిపించుకున్నాడు. అంకుల్, అన్న అంటూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా మరోసారి ముద్ర వేసుకున్నాడు.
తారకరాముడి జన్మదినం.. అవసరానికి సాయం.. సరికొత్త ఛాలెంజ్కు శ్రీకారం
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పలుచోట్ల సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు పలువురు నేతలకు ఆదర్శప్రాయంగా నిలవనుంది. పల్లెల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాకా కేటీఆర్ బర్త్డే వేడుకలను సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. రక్తదాన శిబిరాలు.. మొక్కలు నాటడం.. పేదలకు ఆర్థిక సాయం.. ఇలా వివిధ రూపాల్లో తోచినంత సాయం చేస్తున్నారు.
తారకరాముడి జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ పరిధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటించారు. అటు ఆదిలాబాద్ జిల్లా ముఖ్ర కె గ్రామ వైకుంఠదామంలో 500 మొక్కలు నాటారు. కొన్ని చోట్ల పేద విద్యార్థులకు ఆర్థిక సాయం.. వృద్ధులకు తోచినంత సాయం చేస్తూ కేటీఆర్ పుట్టినరోజును పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు శ్రమిస్తున్నారు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, టీఆర్ఎస్ సీనియర్లు వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.